
గంజాయి నిర్మూలనపై స్పష్టమైన ప్రణాళిక
● డీఐజీ గోపినాథ్ జెట్టి
శ్రీకాకుళం క్రైమ్: గంజాయి నిర్మూలన, నిందితుల అరెస్టు, వారి ఆస్తుల జప్తు, డీ–అడిక్షన్ సెంటర్లకు తరలింపుపై అధికారులకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలని విశాఖ రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూలై 5న పాడేరులో జిల్లాస్థాయి అధికారులతో సమావేశం ఉంటుందని తెలియజేశారు. గడిచిన 2024–25లో గంజా అక్రమ రవాణాపై 694 కేసులు నమోదు చేసి 40,063 కిలోల గంజాయి, 18 కిలోల హనీష్ ఆయిల్, 478 వాహనాలను స్వాధీనం చేసుకొని 1,945 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. ఒడిశా రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశాలు పెడుతున్నామని, 26 స్టాటిక్ చెక్పోస్టుల వద్ద 183 కేసుల్లో 11,047 కిలోల గంజాయి సీజ్ చేసి 469 మందిని అరెస్టు చేశామన్నారు. అదనంగా ఉన్న 298 డైనమిక్ చెక్పోస్టుల వద్ద 237 కేసుల్లో 21,070 కిలోల గంజాయి సీజ్ చేసి 743 మందిని అరెస్టు చేశామన్నారు. రవాణా చేసే ఎనిమిది మంది వ్యాపారుల నుంచి రూ.9.76 కోట్ల ఆస్తులను జప్తు చేశామని, 1310 మంది గంజాయి నేరస్తుల కదలికల మీద నిఘా కోసం షీట్స్ తెరిచామన్నారు. 50 మందిపై పీడీ చట్టం, 19 మందిపై పీటీ ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించేందుకు ప్రతిపాదించామన్నారు. రవాణాలో పాల్గొన్న 527 మందిని, గంజాయితోపాటు ఇతర నేరాల్లో పాల్గొన్న 348 మందిని ఇప్పటికే గుర్తించామన్నారు. 2024–25 కాలంలో 23 కేసుల్లో 40 మంది ముద్దాయిలకు న్యాయస్థానం 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించిందని, 3039 విద్యాసంస్థలు మరియు అన్ని గ్రామాల్లో 10,654 అవగాహన సదస్సులు పెట్టామన్నారు. 51 మంది గంజాయి వినియోగదారులపై కేసులు పెట్టి 161 మందికి పునరావాస కేంద్రాలకు పంపామన్నారు. పాత కేసుల్లో పట్టుబడిన 72,196 కిలోల గంజాయిని, 74.26 కిలోల హనీష్ ఆయిల్ను ధ్వంసం చేశామని తెలియజేశారు.