
రాజకీయ కక్ష సాధింపు..?
● కోమర్తి సర్పంచ్ బంధువుల రేకుల షెడ్డు,
గడ్డికుప్ప తొలగింపు
● రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది
నరసన్నపేట: మండలంలోని కోమర్తి పంచాయతీ సర్పంచ్ ఉంగటి చిన్నమ్ముడు అత్త, భర్తలకు చెందిన ఆస్తులను అధికార యంత్రాంగం బుధవారం తొలగించింది. గ్రామస్తులు ఫిర్యాదు చేశారనే నెపంతో రేకుల షెడ్డు, గడ్డికుప్పను తొలగించారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయని, గడిచిన 60 ఏళ్లుగా తమ తాతల నుంచి ఈ స్థలాన్ని అనుభవిస్తున్నామని చూపించినా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోలేదు. దీనికి కూటమికి చెందిన నాయకుల ఒత్తిడే దీనికి కారణమని సర్పంచ్ చిన్నమ్ముడు, ఆమె భర్త ఉంగటి రాజేశ్వరరావు, సర్పంచ్ అత్త ఉంగటి అప్పమ్మలు అన్నారు. రాజకీయ కక్షతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని, హద్దులు సక్రమంగా ఉన్నప్పటికీ ఇది ప్రభుత్వ భూమి అని తప్పుడు కొలతలు వేసి షెడ్డు తొలగించారని ఆరోపించారు. గడ్డికుప్ప వేసిన స్థలం కూడా తమదేనని వాపోయారు. కొంతమంది ప్రోద్బలంతో ఈ చర్యకు రెవెన్యూ సిబ్బంది పాల్పడ్డారని ఆవేదన చెందారు. దీనికి సంబంధించి ఆర్ఐ సాయిరాం మాట్లాడుతూ ఈ స్థలం కోమర్తిలోని ఎస్సీల కాలనీ కోసం ప్రభుత్వం సేకరించిన స్థలంగా రికార్డుల్లో ఉందని, దీనిపై గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు రాగా పరిశీలించి నోటీసులు ఇచ్చి తొలగించామని తెలిపారు.