
ఐవీఆర్ఎస్ పర్సంటేజ్ తగ్గుదలపై క్షేత్ర పరిశీలన
కవిటి: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరుపై గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం(ఐవీఆర్ఎస్) ఫోన్కాల్స్ శాతం తగ్గుదలపై రాష్ట్ర కమిషనరేట్ వివరణ కోరిందని శ్రీకాకుళం జెడ్పీ సీఈవో ఎల్ఎంవీ శ్రీధర్రాజా తెలియజేశారు. ఈ మేరకు బొరివంక సచివాలయం పరిధిలో బుధవారం ఆకస్మికంగా క్షేత్ర పర్యటన చేశారు. స్థానిక ప్రజలకు వచ్చే కాల్స్ శాతం జిల్లా సగటుకన్నా బాగా తక్కువగా నమోదు కావడంపై ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు ఆసక్తికరమైన విషయాలు ప్రజలు తెలిపారు. ఫోన్కాల్స్ తీసుకుని స్పందించడానికి తమకు అటువంటి కాల్స్ రాలేదన్నారు. అంతేకాకుండా నెటవర్క్ సమస్యలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. మండలంలోని ఐదు సచివాలయాలు ఐవీఆర్ఎస్కు అనుసంధానం చేశామని డిప్యూటీ ఎంపీడీవో అబ్ధుల్ ఖాన్ అన్నారు. అనంతరం బొరివంక, ఇద్దివానిపాలెంలో ఇంటింటికీ శ్రీధర్రాజా వెళ్లి ఐవీఆర్ఎస్ కాల్స్కు స్పందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్యోగులకు సూచించారు. సమావేశంలో ఎంపీడీవో కె.శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ శ్రీరాంప్రసాద్, ఎంపీటీసీ దుద్ది సతీష్ తదితరులు పాల్గొన్నారు.