
హత్య కేసులో నిందితుడు అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్ : మండపల్లి గ్రామంలో ఈ నెల17న జరిగిన బర్రి గంగయ్య హత్య కేసులో నిందితుడు పాతిర్ల దాశరథిరెడ్డి(దాసు)ని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇచ్ఛాపురం సీఐ చిన్నమనాయుడు విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండపల్లికి చెందిన బర్రి గంగయ్య కుమార్తె డిల్లమ్మకు అదే గ్రామానికి చెందిన పాతిర్ల దాశరథి రెడ్డితో 2014లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. దాశరది మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో పిల్లలతో కలిసి భార్య కన్నవారింటికి వెళ్లిపోయింది. ఈసారి సక్రమంగా చూసుకుంటానని, డ్యూటీకి వెళ్లేందుకు బైక్ కావాలని చెప్పగా భార్య డ్వాక్రా సంఘంలో రూ.ఐదు వేలు అప్పుచేసి ఇచ్చింది. మళ్లీ ఎప్పటిలాగే మద్యానికి బానిసై భార్యాపిల్లలను పట్టించుకోకపోవడంతో డిల్లమ్మ మరలా పుట్టింటికి వెళ్లిపోయింది. ఏడాదిగా కన్నవారింటిలో డిల్లమ్మ ఉండటంతో దాశరథి తన మామ గంగయ్యతో ఈ నెల 17న గొడవకు దిగాడు. అనంతరం గంగయ్య సైకిల్పై వెళ్తుండగా గ్రామ సచివాలయం సమీపంలో కత్తితో పొడిచి పరారయ్యాడు. గంగయ్య మృతి చెందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి మంగళవారం లోద్దపుట్టి సమీపంలో దాశరథిని అరెస్టు చేశారు.