
ముక్కలు.. హైటెక్కులు
ప్రత్యేకత చాటుతున్న టాస్క్ఫోర్స్
● జిల్లాలో పెరుగుతున్న జూద శిబిరాలు
● ఆన్లైన్ పేమెంట్లతో కొత్త పంథాలో పేకాట శిబిరాలు
● నిర్వాహకులంతా ప్రముఖులే
● ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్న పోలీసులు
శ్రీకాకుళం క్రైమ్ :
అందరూ కలుసుకునేలా ఓ ఇల్లు.. లోపల ఏం జరిగినా రహస్యంగా ఉండేలా ఏర్పాట్లు.. కరెన్సీ నోట్లతో సంబంధం లేకుండా లావాదేవీలు.. బయట వ్యక్తులకు అర్థం కాకుండా ప్రత్యేక సంజ్ఞలతో ఆదేశాలు.. వెరసి సిక్కోలు జూద శిబిరంలా మారుతోంది. పెడ దోవన పట్టొద్దని చెప్పాల్సిన పెద్దలే జిల్లాలో ఈ జూద శిబిరాలు నిర్వహిస్తుండడం గమనార్హం. జిల్లాకేంద్రంలో ఏకంగా రాజకీయ నాయకులే శిబిరాలు నడుపుతుండటం, అదీ తమ తమ నివాసగృహాల్లోనే బంధువులు, సిండికేట్ ముసుగులో నడుపుతుండటం మరింత చర్చనీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న ఓ ప్రము ఖ వైద్యుడు, జనసేన నాయకుడు ఎచ్చెర్ల పరిధి గెస్ట్హౌస్లోనే నడుపుతూ దొరికిపోయాడు. నిన్నటికి నిన్న నగరంలో పేరున్న టీడీపీ నాయకుడు మరికొందరితో రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. వీరే కాక నరసన్నపేట, టెక్కలి, కాశీబుగ్గల్లో సైతం పేరున్న ప్రముఖులే పట్టుబడటంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు గట్టిగా పనిచేస్తున్నాయి. కానీ పోలీసులకు ధీటుగా జూద నిర్వాహకులు సైతం రోజుకో పంథాతో.. ఆశ్చర్యగొలిపే రీతిలో శిబిరాలు నడిపిస్తున్నారు.
పంథా మార్చేశారు..
ఇది వరకు పేకాట, ఇతర బెట్టింగ్లకు పాల్పడేవారు శిబిరాలకు వెళ్లేటప్పుడు ద్విచక్ర వాహనాలపై, కార్లపై వెళ్లేవారు. ఇప్పుడలా లేదు. నిర్వాహకులు ముందుగా చెప్పిన ప్రకారం ఓ జంక్షన్ వరకు సింగిల్గా వచ్చేయడం, అక్కడే నిర్వాహకుని అసిస్టెంట్ బైక్తో సిద్ధంగా ఉండి ఒకరిద్దరిని ఎక్కించుకుని వెళ్లి శిబిరంపై డ్రాప్ చేసి వదిలేయడం చేస్తున్నారు. ఇలా ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్లు ఉంటారు. వీరికి ఒక్కొక్కరికి రూ.వెయ్యి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరి ఉంటుంది.
ల్యాప్టాప్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, భారీగా నగదు సైతం పట్టుకెళ్లడం లేదు. పేకాట డెన్లన్నీ మార్చేశారు. ఎవరో ఒకరింటి దగ్గర నిర్వహించుకోవడం మొదలుపెట్టారు. పోలీసులు గట్టిగా అడిగితే నాయకుల పేరు చెప్పి తిరగబడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ పోలీసులు జీపులెక్కిస్తే ప్రసన్నం చేసుకోవడానికి మీరు గ్రేట్ అంటూ తమ నాయకుల సిఫార్సులతో ప్రమోషన్లు, నచ్చిన చోట పోస్టింగులిప్పిస్తామంటూ బేరాలు పెడుతున్నారు.
పేకాట ఇంజినీర్లు అనాలేమో..
● జూదంలో ప్లస్ 10 కేఆర్.. ప్లస్ అంటే ఆటలో గెలిచినట్లు టెన్ అంటే పదివేలు, కేఆర్ అంటే కరాటే రాంబాబుతో. అంటే రూ.పదివేలు కరాటే రాంబాబు నుంచి రావాలని అర్థం.
● మైనస్ 20 డీఎన్ అంటే.. రూ.20 వేలు దట్టి నాగేశ్వరరావుకు ఇవ్వాలని అర్థం. 1/20 అంటే ఒకటో గేమ్లో 20 వేలు రావాలి.
● 3/15 అంటే మూడో గేమ్లో రూ.15 వేలు ఇవ్వాలి.. పక్కనే కృష్ణారావుకి ఇవ్వాలి అంటే కేఆర్ ఆని రాస్తారు. అదే రాంబాబు అంటే ఆర్బీ, కిశోర్ అంటే కేఐ ఇలా.. ఇవన్నీ కీప్యాడ్ మొబైల్ లేదా చిన్న స్లిప్పుల్లో గాని, చిన్న సైజు బుక్కుల్లో లేదంటే చేతులమీద, కాళ్లు, తొడలమీద రాసేస్తుంటారు.
● మొన్న ఆదివారం జలుమూరు, రణస్థలం, గార జొన్నలపాడు, వన్టౌన్ లిమిట్స్లో పోలీసులకు ఇదే పరిస్థితి ఎదురైంది. తక్కువ మొత్తంలో నగదు పట్టుబడటం, ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, బళ్లు దొరక్కపోవడం ఒకింత వింతనిపించింది.
ఎస్పీ నేతృత్వంలోని స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు ఇటీవలి కాలంలో దాదాపు 250 నుంచి 300 వరకు పేకాట, బెట్టింగ్ రైడ్లు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. స్పష్టమైన సమాచారంతో మాటువేసి ఎంతటివారినైనా వదలిపె ట్టడం లేదు. కానీ ఇలా పట్టుకోవడాలే కాదు అక్కడక్కడా వదిలేయడాలు కూడా గోప్యంగా జ రుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా లో అధికార పార్టీ నాయకులు, విద్యావేత్తలు, ప్ర ముఖుల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేస్తే ఊరుకునేది లేదని ఎస్పీ హెచ్చరిస్తున్నారు.