
‘ఉపాధి’లో పైసా కూడా దుర్వినియోగం కాకూడదు
● రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ● పీఆర్ శాఖ ఇంజినీర్ల పనితీరు మారాలి ● నరసన్నపేట పర్యటనలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్
నరసన్నపేట: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఎక్కడా పైసా కూడా దుర్వినియోగం కాకూడదని, మెటీరియల్ కాంపొనెంట్ నిధులు మరింత బాధ్యతగా వినియోగించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. నరసన్నపేట మండలం బొరిగివలస, నరసన్నపేటలో శనివారం పర్యటించారు. మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో నిర్మించిన రోడ్లు, ఉపాధి నిధులతో నిర్మించిన ఫారం పాండ్స్, సోప్ పిట్స్ పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్కు హాజరై జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలను తిలకించారు. బొరిగివలస వద్ద ఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు రూ.50 లక్షలతో నిర్మించిన రోడ్డును పరిశీలించారు. రోడ్డు పక్కల వేసిన బెర్ములు నాణ్యతగా లేకపోవడాన్ని గమనించి పీఆర్ ఇంజనీర్లను ప్రశ్నించారు. గ్రావెల్కు బదులు మట్టి వేస్తున్నారని , రోడ్డు వేసిన తరువాత బెర్ములు నాణ్యతగా ఉంటేనే పది కాలాలు ఉంటుందని చెప్పారు. ఇలాగే పనులు చేస్తున్నారా.. అంటూ మండి పడ్డారు. బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారని పీఆర్ ఇంజనీర్లు వెనకేసుకురావడాన్ని ఆయన తప్పుపట్టారు. అనంతరం బొరిగివలసలో ఫారం పాండ్స్ను పరిశీలించి రైతు పొన్నాడ ప్రసాద్కు పలు సూచనలు చేశారు. పంచాయతీ కార్యాలయం సమీపంలో మంచినీటి బోరు వెల్ వద్ద సోప్పిట్ నిర్మాణం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి వేతనాలు త్వరలోనే విడుదలవుతాయని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, పీడీ బి.సుధాకర్, జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, పలువురు ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.