
జీఎస్టీ ఆదాయంలో క్షీణత
జీఎస్టీ ఆదాయ వివరాలివే..
2024లో జనవరి 1 నుంచి మే 31 వరకు రూ.105.96 కోట్లు ఆదాయం లభించింది. 2025లో జనవరి 1 నుంచి మే 31 వరకు రూ.86.05 కోట్లకే ఆదాయం పరిమితమైంది. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే 2024 ఆమదాలవలస సర్కిల్లో రూ.17.85 కోట్లు, 2025 రూ.14.25 కోట్లు, కాశీబుగ్గలో 2024లో రూ.8.52 కోట్లు, 2025లో రూ.9 కోట్లు, నరసన్నపేట సర్కిల్లో 2024లో రూ.10.05 కోట్లు, 2025లో రూ.11.15 కోట్లు , 2024లో శ్రీకాకుళం సర్కిల్లో రూ.68.87 కోట్లు, 2025లో రూ.51.75 కోట్లు ఆదాయం వచ్చింది.
● జనవరి నుంచి మే వరకు
రూ.15 కోట్లకుపైగా తగ్గిన ఆదాయం
● ప్రజల్లో తగ్గిన కొనుగోలు శక్తి
● గతంలో పథకాలు రావడంతో పెరిగిన లావాదేవీలు
● కూటమి వచ్చాక పథకాలు లేక తగ్గిన కొనుగోళ్లు
● జిల్లాలో 2024లో జనవరి నుంచి మే వరకు రడీమేడ్, వస్త్ర వ్యాపారం రూ.120 కోట్లకు పైగా జరిగింది. ఈ ఏడాది అది రూ.80 కోట్లకు తగ్గింది.
● జిల్లా వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లలో జనవరి నుంచి మే వరకు రూ.50 కోట్లకు పైబడి వ్యాపారం జరిగేది. ఈ ఏడాది అది రూ.35 కోట్లకు పరిమితమైంది.
● కిరాణా సరుకులు, నిత్యావసర సరుకుల క్రయవిక్రయాలు జనవరి నుంచి మే వరకు రూ.800 కోట్లు వరకు జరిగేవి. ఈ ఏడాది రూ. 550 కోట్లు వరకు మాత్రమే జరిగాయి.
శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల కొనుగోళ్ల శక్తి తగ్గడంతో ఆ ప్రభావం జీఎస్టీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లాలో అన్ని వ్యాపారాలు కలిపి జనవరి నుంచి మే నెల వరకు రూ.1500 కోట్లు మేర లావాదేవీలు జరిగాయి. దీని ద్వారా ప్రభుత్వానికి జీఎస్టీ రూపేణా ఆదాయం లభించింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.15 కోట్లకు పైగా జీఎస్టీ ఆదాయం తగ్గింది. మద్యం మినహాయిస్తే ఏ వ్యాపారాన్ని చూసినా గతేడాది కంటే ఈ ఏడాది 5 నెలల్లో లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే చాలా వ్యత్యాసం కన్పిస్తోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గడమే దీనికి కారణం.
పథకాల్లో కోత..
గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు సకాలంలో అందేవి. అమ్మఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, చేదోడు, రైతు బీమా, సున్నా వడ్డీ, కాపు నేస్తం వంటి ఎన్నో పథకాలు సకాలంలో అందేవి. దీంతో పేద ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు కొనుగోలు చేసుకుండేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లు సకాలంలో ఇస్తున్నప్పటీకీ చాలా మందికి కోత విధించారు. తల్లికి వందనం, మహిళలకు రూ.1500, రైతు బీమా, సూపర్ సిక్స్ అంటూ ఎన్నో పథకాలను అమలు చేయకుండా వదిలేశారు. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్లాన్ అప్రూవల్ జరగకపోవడం, ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. రైతుకు సహాయం చేసే పథకాలు ఎత్తివేయడం, గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో వ్యవసాయ పనులు కూడా తగ్గిపోయాయి. వీటి కారణంగా కూలి పనులు లేకుండా పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు పెరిగిపోతుండగా ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలతో పాటు మరెన్నో ప్రయోజనాలు అందడం లేదు. ఉద్యోగ విరమణ చేసిన వారికి సైతం గ్రాట్యుటీ వంటి ఇతర ప్రయోజనాలకు మంజూరు చేయకపోవడం, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవటం, ఉపాధి హామీ వేతనదారులకు సకాలంలో బిల్లులు చెల్లింపులు జరపకపోవటంతో జీవనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అన్ని వర్గాల వారిపై వేటు వేయడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది.