
అక్రమ భవన నిర్మాణం అడ్డగింత
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని కేటీ రోడ్లో పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా నిర్మితమవుతున్న అక్రమ భవన నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ బేఖాతరు చేసి సదరు బిల్డింగ్ యజమాని నిర్మాణ పనులను కొనసాగిస్తుండగా, కమిషనర్ నడిపిన రామారావు ఆదేశానుసారం పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ సిబ్బంది సదరు నిర్మాణ పనులను బుధవారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ పురపాలక సంఘంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలను చేస్తే సదరు బిల్డింగ్ యజమానులపై కేసులు వేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. అక్రమ భవన నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి, నిబంధనల మేరకు నడుచుకోవాలని హెచ్చరించారు.
నలుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
శ్రీకాకుళం క్రైమ్: ఎచ్చెర్ల మండల పరిధిలోని శ్రీకాకుళం సింహద్వారం సమీపంలో నలుగురు జూదరులు పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.14500 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎచ్చెర్ల పోలీసులు తెలిపారు.
గుండెపోటుతో కళాకారుడు మృతి
కంచిలి: గ్రామదేవత ఉత్సవాల్లో స్టేజీ ప్రోగ్రామ్ ఇచ్చేందుకు వచ్చిన ఒక కళాకారుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన బుధవారం కంచిలిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి కంచిలి ఉత్సవాల్లో భాగంగా సినీ డూప్స్ స్టేజీ ప్రోగ్రాం ఇచ్చేందుకు కళాకారుల బృందం ఉదయమే వచ్చారు. వీరు మంగళవారం రాత్రి వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడలో ప్రదర్శన ఇచ్చి, అటునుంచి ఇక్కడికి వచ్చారు. ఉదయం కాలకృత్యాలు తీర్చుకోడానికి స్థానిక మఠం చెరువు వద్దకు వెళ్లారు. వీరిలో బాలకృష్ణ డూప్గా నటిస్తున్న సప్ప కల్యాణ్(65) చెరువు గట్టు మీద ఒక చెట్టుకింద కూర్చొని గుండెనొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఇతనిది విశాఖపట్నం జిల్లా గాజువాక పెద్దగంట్యాడ ప్రాంతం. తోటి కళాకారుడు మృతి చెందడంతో ఉత్సవ కమిటీ సభ్యులు ఈ ప్రదర్శనను రద్దు చేశారు.

అక్రమ భవన నిర్మాణం అడ్డగింత