
వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖ వాతావారణ కేంద్రం నుంచి జిల్లాకు సమాచారం వచ్చింది. బాలాసోర్కు తూర్పు గా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి తీవ్రవాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నా రు. సాయంత్రం బెంగాల్–బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. సాగర్ ఐలాండ్ ఖేపుపరా వద్ద తీరం దాటే అవకాశం ఉంది. 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కోతకు గురైన తీరం
వజ్రపుకొత్తూరు : అల్పపీడన ప్రభావంతో తీరం అల్లకల్లోలంగా మారింది. ఎగసి పడుతున్న కెరటాల ధాటికి తీరం కోతకు గురవుతోంది. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద సముద్రం దాదాపు 90 మీటర్లు వరకు ముందుకు రావడంతో ఇసుక దిబ్బలు కరిగిపోయి సంప్రదాయ తెప్పలు, వలలు మునిపోయాయి. తీరం వెంబడి ఉన్న ఈత, ఇతర చెట్లు అలల ఉధృతికి కూలిపోతున్నాయి. దీంతో మత్స్యకారులు తమ వలలు, తెప్పలు, పడవలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పూడిలంక ఉప్పుటేరు వద్ద పడవలను లంగరు వేసి ఉంచారు. వలలు, సంప్రదాయ తెప్పలు, తీరంలోనే ఉండిపోవడం.. మరోవైపు చేపల వేట నిషేధం అమలవుతుండడంతో మత్యకారులు అవస్థలకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి అధిక వర్షాలు, తుఫాన్ల సమయంలో తమను ఆదుకోవాలని మత్స్యకారులు జి.శంభూరావు, మోహనరావు, లక్ష్మయ్య, రాజు తదితరులు కోరుతున్నారు.
నైరుతిపై సన్నద్ధత: కలెక్టర్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో నైరుతి రుతు పవనాలు వారం ముందుగానే ప్రవేశించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి గురువారం నిర్వహించిన సన్నద్ధత సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. గత సంవత్సరం ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి మరింత సమగ్రంగా, పటిష్టంగా ప్రణాళికలు రూ పొందించాలని కలెక్టర్ ఆదేశించారు. విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) ప్రకారం కార్యాచరణను రూపొందించుకొని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి, వాటి ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని తెలియజేశారు. గత ఏడాది హిరమండలం–కొత్తూరు మధ్య రోడ్డు పైకి వరద నీరు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
● ఎగసి పడుతున్న అలలు
● తీరానికే పరిమితమైన
సంప్రదాయ తెప్పలు, వలలు