
యోగాంధ్రకు భారీ ప్రణాళికలు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘యోగాంధ్ర’ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమవుతోంది. మే 24 నుంచి జిల్లా స్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇప్పటికే ప్రారంభం కాదా, మే 27 నుంచి మండల స్థాయి లో ట్రైనర్లకు శిక్షణలు ప్రారంభం కానున్నాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రతి మండలంలో 200 మంది యోగా ట్రైనర్లను తయారు చేయడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. శిక్షణలో పాల్గొన్న మాస్టర్ ట్రైనర్లు, ట్రైనర్లు, సాధకులకు ఆయుష్ శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ద్వారా ధ్రువపత్రాలు జారీ చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు.
చారిత్రక ప్రదేశాల్లో..
మే 27న డచ్ బిల్డింగ్లో, జూన్ 3న అరసవల్లి సూర్యదేవాలయంలో, జూన్ 7న శాలిహుండం బౌద్ధ స్థూపాల వద్ద, జూన్ 10న కళింగపట్నం బీచ్లో యోగా శిబిరాలు నిర్వహించనున్నారు. ప్రతి కేంద్రానికి వెయ్యిమంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ను మొత్తం కార్యక్రమానికి సమన్వయాధికారిగా నియమించారు.
డచ్ బిల్డింగ్ వద్ద ఉత్సాహం
యోగాంధ్ర–2025 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీకాకుళం జిల్లా అధికారులు మరింత ఉత్సాహంతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం డచ్ బిల్డింగ్ వద్ద వెయ్యిమందితో భారీ యోగా శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శిబిరాన్ని పదిభాగాలుగా విభజించి, ప్రతి బ్లాక్ ఎదురుగా ఒక యోగా నిపుణుడితో ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం 38 నుంచి 45 మంది యోగా ఇన్స్ట్రక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఏర్పాట్లపై సోమవారం జిల్లా ముఖ్య అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేశారు.
యోగాంధ్ర షెడ్యూల్ విడుదల
యోగాంధ్ర షెడ్యూల్ను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సోమవారం వెల్లడించారు. విభిన్న కేటగిరీల్లో ప్రదర్శనలు ఉంటాయని పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా యోగాంధ్ర యాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఒక్కో వయస్సు గ్రూప్కి ప్రత్యేక ఆసనాలు సూచించారు. గ్రామస్థాయిలో పోటీలు మే 26 నుంచి 30 వరకూ, మండలస్థాయిలో జూన్ 2 నుంచి 7 వరకు, జిల్లాల్లో జూన్ 9 నుంచి 14 వరకు, రాష్ట్రస్థాయి ఫినాలే జూన్ 16 నుంచి 18 వరకు జరగనున్నట్లు తెలిపారు.