పాతపట్నం: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రజలను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ విమర్శించారు. పాతపట్నంలోని రెడ్డి అపార్ట్మెంట్లోని తన కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓట్లు కోసం సూపర్ సిక్స్ పథకాలైన తల్లికి వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటూ అన్నివర్గాలనూ కూటమి నాయకులు మోసం చేశారన్నారు. వెరిఫికేషన్ పేరుతో గత 20 ఏళ్లుగా ఉన్న పింఛన్లను తొలగిస్తున్నారని, దివ్యాంగులను ఎండల్లో తిప్పి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన పది నెలల్లోనే ప్రజలను నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, వాటికి భయపడేది లేదన్నారు. ప్రజల సమస్యలపై ప్రతీ సోమవారం మండల, జిల్లా స్థాయి గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎల్.ఎన్.పేట జెడ్పీసీటీ సభ్యుడు కిల్లారి త్రినాథరావు, పార్టీ నాయకులు తూలగాపు తిరుపతిరావు, ఎన్ని తిరుపతి, నాగరాజు, గూరాడి అప్పన్న, బొని గిరి, బోసి రామారావు, కనకాల కర్రెన్న, పల్లి గోవిందరావు, కీర్తి తిరుమలరావు, సర్పంచ్లు పాల్గొన్నారు.