శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యుయేషన్ సోమవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా సోమవారం మొదటివిడత సబ్జెక్టుల జవాబుపత్రాల దిద్దుబాటు ప్రక్రియ మొదలైంది. జవాబుపత్రాల దిద్దుబాటులో సీఈలు, ఏఈలు అప్రమత్తంగా వ్యవహరించాలని, ముఖ్యంగా సమయపాలన కచ్చితంగా పాటించాలని ఆర్ఐఓ/జిల్లా స్పాట్ క్యాంఫ్ ఆఫీసర్ ప్రగడ దుర్గారావు పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన ప్రతి ఒక్కరు స్పాట్ కేంద్రం వద్ద విధిగా రిపోర్ట్ చేయాలని ఆర్ఐఓ పి.దుర్గారావు స్పష్టంచేశారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
సోంపేట: మండలంలోని బారువ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని బారువ గ్రామానికి చెందిన నెయ్యిల అశోక్ కుమార్ (43) సోమవారం మృతి చెందాడు. రైల్వేలైన్ దాటుతుండగా ప్రమాదం జరిగి ఉండవచ్చునని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య వసంత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.
ఆదిత్యాలయంలో అక్రమ
వ్యవహారాలపై విచారణ
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఇటీవల కాలంలో ‘సాక్షి’తో పాటు పలు పత్రికల్లో వచ్చిన పలు కథనాలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాల మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లావణ్య సోమవారం సాయంత్రం అరసవల్లిలో అధికారులతో చర్చించి అక్రమ వ్యవహారాల అంశాల వారీగా వివరాలను సేకరించారు. అభియోగాలు ఎదుర్కొంటున్న ఆలయానికి చెందిన పలువురు దినసరి వేతనదారులతో పాటు ఇతర ఉద్యోగుల నుంచి లిఖిత పూర్వకంగా స్టేట్మెంట్స్ రికార్డు చేశారు. రిటైర్డ్ ఈఓ జగన్మోహనరావుపై వస్తున్న అనేక అవినీతి ఆరోపణలపై కూడా ఆరా తీశారు. రథసప్తమి నాడు నిబంధనలకు విరుద్ధంగా వీఐపీ టిక్కెట్ల విక్రయాలు చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కంప్యూటర్ ఆపరేటర్ యుగంధర్ నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే అన్నదాన ప్రసాదాల కౌంటర్లు నిర్వహణలో ఇబ్బందులు, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా విచారణ చేశారు.