న్యూస్రీల్
● జిల్లా ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి
కలెక్టర్ ఆదేశం
హిందూపురం టౌన్: ‘‘ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ పనితీరు మెరుగుపర్చుకోవాలి. విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోం’’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు. శనివారం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని వివిధ విభాగాలను, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. నేరుగా రోగులతో మాట్లాడారు. ఓపీ, ఐపీ వార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రి ప్రాంగణం, వార్డులను శుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ఓపీ వద్ద వీల్ చైర్, స్ట్రెక్చర్లు లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వాటిని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. మాతాశిశు కేంద్రం పైభాగంలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, లిఫ్ట్ పనులు చేపట్టాలని సూచించారు. జిల్లా ఆస్పత్రిలో మార్చురీ నిర్మాణం, వంట గది నిర్మాణాలు చేపట్టాలని సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు నర్సులు ఆస్పత్రిలో సిబ్బంది కొరత గురించి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ వెంట డీసీహెచ్ఎస్ మధుసూదన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ జనార్దన్, ఆర్ఎంఓ, వైద్యులు ఉన్నారు.


