
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
సాక్షి పుట్టపర్తి: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ శంకర్ నారాయణ అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో జిల్లా పరిషత్తు చైర్పర్సన్ హారికపై టీడీపీ నేతలు దాడి చేయడం దారుణమన్నారు, మహిళ అని కూడా చూడకుండా దాడులకు పాల్పడడం రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని అభివర్ణించారు. దౌర్జన్యాలు, దాడులతో ఆంధ్రప్రదేశ్ బిహర్ను తలపిస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. మహిళలు స్వేచ్ఛగా బయట తిరగాలన్నా భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. చైర్పర్సన్పై దాడి జరిగితే ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
‘ఆశల్ని’ ఆపేశారు!
అధికారుల అలసత్వం.. రైతులకు అశనిపాతం
● హెచ్చెల్సీలో పూర్తి కాని మరమ్మతు పనులు
● సరిహద్దులో ఆగిన తుంగభద్ర జలాలు
బొమ్మనహాళ్: రైతుల ఆశలపై అధికారులు నీళ్లు చల్లారు. ముందస్తుగా నీరొచ్చాయని పడిన సంతోషాన్ని ఆదిలోనే దూరం చేశారు. గంగపూజ నిర్వహించి స్వాగతించాల్సిన సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఈనెల 10న నీటిని హెచ్చెల్సీ కాలువకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రికి బొమ్మనహాళ్ సరిహద్దులోని 105–272 కిలోమీటర్ వద్దకు నీళ్లు చేరుకున్నాయి. అయితే, హెచ్చెల్సీలో మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతుండడంతో ఇబ్బంది లేకుండా 105వ కిలోమీటర్ వద్ద రెగ్యులేటర్లను కిందికి దించి వేసి నీరు ఆంధ్రాలోకి ప్రవేశించకుండా ఆపేశారు.
పర్యవేక్షణ కరువై ఇష్టారాజ్యం..
కాంట్రాక్టర్ల అలసత్వం.. పర్యవేక్షణ ఇంజినీర్ల నిర్లక్ష్యం కారణంగా హెచ్చెల్సీలో మరమ్మతు పనులు అనుకున్నట్లుగా సాగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 115 నుంచి 138 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులు, నాగలాపురం వద్ద, ఉద్దేహాళ్–మల్లికేతి బ్రిడ్జిలు పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పనుల పూర్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ నీటిని సరిహద్దుల్లోనే ఆపేయాల్సి ఉంటుంది. మరోవైపు రైతులు ఇప్పటికే బోర్ల కింద వరి నారు, మిరప నార్లు పోసుకున్నారు. తుంగభద్ర జలాలు వచ్చి ఉంటే నారుకు బాగుండేదని, బోరు నీటికి నారు పైరు ఎర్రగా మారుతుందని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో మరమ్మతు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయించి తమకు సాంత్వన చేకూర్చాలని రైతులు కోరుతున్నారు.

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది