పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

Jun 22 2025 3:30 AM | Updated on Jun 22 2025 3:30 AM

పాలిస

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

అనంతపురం: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. శనివారం ఉమ్మడి జిల్లాలో అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, హిందూపురం మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. తొలిరోజు 1 నుంచి 15 వేల ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టినట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సి. జయచంద్రా రెడ్డి తెలిపారు. మొత్తం 161 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు పేర్కొన్నారు.

మరిన్ని వివరాలిలా..

28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్‌ 25 నుంచి జూన్‌ 30 వరకు(25,26 తేదీల్లో 1–50,000 ర్యాంకు వరకూ, 27,28 తేదీల్లో 50,001–90000, 29,30 తేదీల్లో 90,001–చివరి ర్యాంకు) వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ జరుగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్‌లైన్‌ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించిన రసీదు, పాలిసెట్‌ –2025 హాల్‌ టికెట్‌, ర్యాంకు కార్డు, పదో తరగతి స్టడీ ఒరిజనల్‌ సర్టిఫికెట్‌, 4 నుంచి పదో తరగతి వరకు స్టడీ ధ్రువపత్రాలు, కుల, ఓసీ అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్‌, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డుతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలను తీసుకెళ్లాలి. కౌన్సెలింగ్‌లో పాల్గొనే ఓసీ, బీసీలు రూ.700, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన రసీదును కౌన్సెలింగ్‌ కేంద్రంలో అప్పగించాలి. స్టడీ సర్టిఫికెట్‌ లేని వారు ఏడు సంవత్సరాల రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌, ఈడబ్ల్యూఎస్‌ వర్తించే వారు అర్హత ధ్రువపత్రం అందజేయాలి.

ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్‌ తేదీలిలా..

తేదీ ర్యాంకు నుంచి ర్యాంకు వరకు

22 15,001 32,000

23 32,001 50,000

24 50,001 68,000

25 68,001 86,000

26 86,001 1,04,000

27 1,04,001 1,20,000

28 1,20,001 చివరి ర్యాంకు.

అరుదైన చేప..

చెడు చేస్తుందప్పా

గుత్తి రూరల్‌: మండలంలోని బ్రాహ్మణపల్లి చెరువులో అరుదైన దెయ్యం చేప లభ్యమైంది. సాధారణంగా సముద్ర తీర ప్రాంతాలైన కోనసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిపించే ఈ చేప శనివారం స్థానిక మత్స్యకారుల వలకు చిక్కింది. అయితే దెయ్యం చేపలు తింటే రోగాల పాలవుతారని, ఈ చేపలు వృద్ధి చెందితే విలువైన చేపల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని తెలియడంతో మత్స్యకారులు దాన్ని చెరువు సమీపంలో పూడ్చిపెట్టారు.

రుణదాతల ఒత్తిళ్లు..

వివాహిత ఆత్మహత్యాయత్నం

కనగానపల్లి: రుణదాతల ఒత్తిళ్లు తాళలేక ఓ వివాహిత పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన శనివారం మండలంలోని తూంచర్లలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.... తూంచర్ల గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ గతంలో అగ్రిగోల్డు ఏజెంట్‌గా పనిచేసేవాడు. ఆ సంస్థ మూతపడటంతో కొంతమంది పాలసీదారులకు అతనే అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించాడు. దీనికితోడు పంటల సాగుకోసం కూడా అప్పులు చేశాడు. వీటిని సకాలంలో తిరిగి చెల్లించకపోవటంతో రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. ఇటీవల కాలంలో నేరుగా ఇంటికి వెళ్లి రాజ్‌కుమార్‌తో పాటు అతని భార్య రాధమ్మను సైతం నిలదీయడం ప్రారంభించారు. శనివారం కూడా కొందరు రుణదాతలు రాజ్‌కుమార్‌ ఇంటికి వెళ్లి ఆయన భార్యను రుణం తీర్చాలంటూ పట్టుబట్టారు. ఈ ఒత్తిళ్లను భరించలేని రాధమ్మ మనస్తాపానికి గురై సాయంత్రం పురుగులు మందు తాగింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం 
1
1/1

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement