
పాల వ్యాన్ బోల్తా
నల్లచెరువు: మండలంలోని పెద్దయల్లంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై పాల వ్యాన్ అదుపు తప్పి మోరీకి ఢీకొని బోల్తా పడింది. తేజాస్ కంపెనీకి చెందిన పాల వ్యాన్ మంగళవారం కాలసముద్రంలో పాలు సేకరించుకుని చిత్తూరు జిల్లా పూతలపట్టులోని డెయిరీకి బయలు దేరింది. పెద్దయల్లంపల్లి సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి వ్యాన్ అదుపు తప్పి మోరీని ఢీ కొట్టి జాతీయ రహదారి పక్కనే ఉన్న గుంత లోకి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ శ్యాంప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
వృద్ధుడి బలవన్మరణం
రాప్తాడు: మండలంలోని గంగలకుంట సమీపంలో మంగళవారం ఉదయం 8 గంటలకు రైలు కింద పడి ఓ గుర్తు తెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ మేరకు ధర్మవరం రైల్వే పోలీసులు తెలిపారు. సుమారు 65 నుంచి 70 మధ్య వయస్సు గల వ్యక్తి తెలుగు రంగు చొక్కా, నలుపు రంగు డ్రాయర్, బ్రౌన్ కలర్ లుంగీ ధరించాడు. అతనికి ఎడమ కాలు లేదు. రెండు చేతులు కూడా అవిటిగా ఉన్నాయి. ఆచూకీ తెలిసిన వారు 95502 16049, 99513 25345 కు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు.
జేఎల్ఎం ఆత్మహత్య
పరిగి: మండలంలోని కాలువపల్లికి చెందిన డీఎల్ మురళీకృష్ణ(53) ఆత్మహత్య చేసుకున్నాడు. హిందూపురంలోని విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్న ఆయనకు భార్య నాగరత్నమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడిగెనహళ్లిలో నివాసముంటూ రోజూ విధులకు వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ మాత్రలతో అరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. వ్యాధి మరింత ముదురుతుండడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన సోమవారం రాత్రి 9 గంటలకు కొడిగెనహళ్లి నుంచి సొంతూరు కాలువపల్లికి వెళ్లి, తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ తండ్రి ఇంటికి రాకపోవడంతో కుమారుడు కాలువపల్లికి వెళ్లి పరిశీలించాడు. అప్పటికే ఇంట్లో వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న దృశ్యాన్ని చూసి బంధువులకు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రంగడు యాదవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

పాల వ్యాన్ బోల్తా