పుట్టపర్తి టౌన్: కూటమి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆటోవాలాకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం అందేది. అలాగే వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయూత దక్కేది. అయితే కూటమి ప్రభుత్వంలో ఆటోవాలా గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఎన్నికల హామీ మేరకు ఏటా రూ.15 వేల ఇవ్వాల్సి ఉన్నా.. ఇప్పటికీ హామీలతోనే సరిపెడుతున్నారు. తాజాగా ఆగస్టుకు ఈ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించినా అది కార్యరూపం దాల్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ఫలితంగా తమకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని జిల్లాలోని సుమారు 30 వేల మంది ఆటో డ్రైవర్లు వాపోతున్నారు.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం
ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు పలు హామీలను చంద్రబాబు గుప్పించారు. బ్యాడ్జి కలిగిన అన్ని వాహనాల డ్రైవర్లకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం, భారీ జరిమానాలకు కారణమవుతున్న జీఓ నంబర్ 21, 31 రద్దు చేస్తామన్నారు. అలాగే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గింపు, టాటా మ్యాజిక్ వ్యాన్లు జీపులు, కార్లకు గ్రీన్ ట్యాక్స్ థర్డ్పార్టీ ఇన్సూరెన్స్లు, టోల్గేట్ ఫీజులు తగ్గిస్తామన్నారు. డ్రైవర్లకు సాఽధికార సంస్థ ఏర్పాటు చేసి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యారుణాల మంజూరు, చంద్రన్న బీమా ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తామంటూ గొప్పలకు పోయారు. అధికారం చేపట్టి ఏడాది గడచిన ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో అరచేతిలో వైకుంఠం చూపి తమను మోసం చేశాడని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయం తగ్గి... ఖర్చులు పెరిగి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతోంది. దీంతో రోజంతా కష్టపడితే రూ.300 నుంచి రూ.400 వరకు మిగలని పరిస్థితి నెలకొంది. ఏటా ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం దాదాపు రూ.15 వేల వరకు ఖర్చు అవుతోంది. వీటితో పాటు పోలీసులు, రవాణా శాఖ అధికారులు తనిఖీల పేరుతో వేలాది రూపాయల జరిమానా విధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటో కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి నెలవారీ కంతులు కట్టుకోలేక ఆటో కార్మికులు బతుకులు దినదిన గండంగా మారాయి. వచ్చే అరకొర ఆదాయం ఇంధనం, ఇతర ఖర్చులకు సరిపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది.
ఆటోవాలా సంక్షేమాన్ని విస్మరించిన
చంద్రబాబు
కార్మికుల కష్టాలు పట్టించుకోని
కూటమి సర్కార్
ఎన్నికల హామీ మేరకు ఏటా
రూ.15 వేలు నేటికీ ఇవ్వని వైనం
గతంలో ‘వాహన మిత్ర’ ద్వారా
ఆదుకున్న వైఎస్ జగన్
ఏటా రూ.10 వేలతో పాటు
సంక్షేమ పథకాలన్నీ అందజేసిన వైనం
ఎన్నికల హామీలు నెరవేర్చాలి
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదు. పైగా జరిమానాలు పెరిగిపోయాయి. కూటమి సర్కార్ ఇప్పటికై నా ఆటో కార్మికుల గురించి ఆలోచించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ. 15 వేల ఆర్థిక సాయంతో పాటు 21, 31 జీఓల రద్దు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
– బెస్త శేఖర్, ఆటో డ్రైవర్, పుట్టపర్తి
మాట నెలబెట్టుకోవాలి
ఇప్పటి వరకూ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆటో డ్రైవర్లను గుర్తించిన నాయకుడు లేరు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో మా సమస్యలు గుర్తించి అధికారంలోకి రాగానే ఆదుకుంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏటా రూ.10 వేలు అందజేశారు. చంద్రబాబు కూడా ఎన్నికల సమయంలో మాకు అనేక హామీలిచ్చారు. వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. – తిరుపాల్ నాయక్,
డ్రైవర్, బ్రాహ్మణపల్లి తండా
గతంలో అండగా నిలిచిన జగన్
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించారు. అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీక్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసి ఆదుకున్నారు. దీంతో పాటు ప్రమాదవశాత్తూ మృతి చెందితే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల బీమా వర్తింపజేశారు. అలాగే వాహనం కొనుగోలుకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే డ్రైవర్లకు రూ. 3 లక్షల వరకూ వడ్డీ రాయితీ అందించారు.
ఆటో బండి.. కష్టాలు దండి
ఆటో బండి.. కష్టాలు దండి