
‘ఉద్యానం’ చుట్టూ అధ్వానం
ధర్మవరం రూరల్: ధర్మవరం పట్టణం ఇందిరమ్మ కాలనీలోని ఆరుబయలులో ఏర్పాటు చేసిన ఉద్యాన శాఖ వనరుల కేంద్రం పరిసరాలు అధ్వానంగా మారాయి. సిబ్బంది విధులు ముగించుకుని వెళ్లాక ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. మందుబాబులు ఇక్కడే సిట్టింగ్ వేస్తున్నారు. మద్యం తాగి.. అక్కడే సీసాలు పడేస్తున్నారు. కొందరు పగులగొడుతున్నారు. దీనికితోడు స్థానికులు ఇక్కడ ఎవ్వరూ ఉండరని కార్యాలయ తలుపుల వద్ద మెట్లపైన, సమీపాన మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. ఉదయం పూట విధులకు హాజరైన సిబ్బంది ఆ కంపును దాటి లోనికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. పోలీసులు రాత్రిపూట గస్తీ నిర్వహిస్తే మందుబాబులు రాకుండా ఉంటారని కార్యాలయ సిబ్బంది అంటున్నారు.