
బ్రెయిన్ డెడ్ బాలుడి అవయవ దానం
కళ్యాణదుర్గం రూరల్: బ్రెయిన్ డెడ్ అయిన ఓ బాలుడి అవయవాలను అతడి తల్లిదండ్రులు దానం చేశారు. మృతిచెందిన తర్వాత తమ కుమారుడు మరికొంత మంది జీవితాల్లో వెలుగులు నింపుతాడనే భావంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి మరీ అవయవదానానికి అంగీకరించారు. వివరాలిలా ఉన్నాయి... కళ్యాణదుర్గం మండలం గరుడాపురం – కొత్తూరు గ్రామాల మధ్య మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తలకు తీవ్ర గాయమై అనంతపురంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీహరి (18) బ్రెయిన్ డెడ్ అయినట్లు గురువారం వైద్యులు నిర్ధారించారు. దీంతో అతడి తల్లిదండ్రులు అనసూయమ్మ, ఈరన్న, సోదరి సింధూజ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న జీవన్ధాన్ ఫౌండేషన్ ప్రతినిధులు... శ్రీహరి అవయవాలను దానం చేస్తే కొంతమందికి ప్రాణదానం చేయవచ్చని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించడంతో అంతటి దుఃఖంలోనూ వారు అంగీకారం తెలిపారు. దీంతో శ్రీహరి గుండె, కళ్లు, కిడ్నీలను జీవన్దాన్ ప్రతినిధులు సేకరించి అత్యవసరమైన రోగుల కోసం మెట్రో నగరాల్లోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, ఇంటర్ వరకూ చదువుకున్న శ్రీహరి... కొత్తూరు గ్రామంలోనే తల్లిదండ్రులకు వ్యవసాయ వనుల్లో చేదోడుగా ఉండేవాడు. అవయవ దానం చేసేందుకు అంగీకరించిన శ్రీహరి తల్లిదండ్రులను వైద్య సిబ్బంది అభినందించారు.