
బదిలీ టీచర్లకు ‘స్పౌజ్’ తంటా
అనంతపురం ఎడ్యుకేషన్: దంపతులిద్దరూ ఉద్యోగులై ఉండి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే కుటుంబ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించి ‘స్పౌజ్’ పాయింట్ల పద్ధతి తీసుకొచ్చింది. దీనిద్వారా బదిలీల్లో భార్య/భర్తలో ఒకరు ఐదు పాయింట్లు పొందవచ్చు. ‘స్పౌజ్’ కోటాలో బదిలీ అయ్యే భర్త లేదా భార్య పని చేస్తున్న సమీపంలోకి వెళ్లాలి. ఇద్దరూ వెళ్లొచ్చేందుకు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే ‘స్పౌజ్’ కోటాలో పాయింట్లు పొందిన చాలామంది భర్త/భార్య పని చేస్తున్న సమీపానికి కాకుండా జిల్లా కేంద్రానికి లేదా వారికి అనుకూలమైన స్కూళ్లకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో చాలామంది జిల్లా సరిహద్దు మండలాల్లో పని చేస్తున్నా.. వారి భాగస్వాములు మాత్రం ‘స్పౌజ్’ పాయింట్లు పొంది జిల్లా కేంద్రం, పట్టణాల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పని చేస్తున్నారు.
‘స్పౌజ్’ సమీపంలోకి వెళ్లాల్సిందే!
తాజాగా ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్లో ‘స్పౌజ్’ నిబంధనలను విద్యాశాఖ అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. భార్య, భర్త పని చేస్తున్న స్కూల్లో ఖాళీగా ఉంటే కచ్చితంగా అక్కడికి పోవాల్సిందే. అక్కడ ఖాళీ లేకపోతే సమీప స్కూళ్లు, మండలం, ఆ తర్వాత పక్క మండలాలకు వెళ్లాల్సి ఉంది. ఒకే స్కూల్కు అంటే ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లు తక్కువ సంఖ్యలో ఉంటారని, ఈ నేపథ్యంలో అవసరాలకు దంపతులిద్దరూ ఒకేసారి సెలవు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుందని బాధిత టీచర్లు వాపోతున్నారు.
పాయింట్లు ఎక్కువ ఉన్నా
దూర ప్రాంతాలకు..
ఎక్కువ పాయింట్లు ఉండికూడా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. కూడేరు మండలం గొట్కూరులో పని చేస్తున్న శ్రీదేవికి స్పౌజ్ పాయింట్లతో కలిపి 42.6 పాయింట్లు ఉన్నాయి. ఈమె భర్త శ్రీనివాసరెడ్డి ఇటీవల గణితం స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది బొమ్మనహాళ్ మండలం గోవిందవాడకు వెళ్లారు. దీంతో శ్రీదేవి కూడా అక్కడికి పోవాల్సిందేనంటూ అధికారులు తేల్చి చెప్పడంతో ఆమె కూడా బొమ్మనహాళ్ మండలానికి వెళ్లారు. 35, 36 పాయింట్లు ఉన్న జనరల్ టీచర్లకు అనంతపురం చుట్టుపక్కన 16 శాతం హెచ్ఆర్ఏ స్కూళ్లు వచ్చాయి. తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లు, కదిరి, ధర్మవరం, పెనుకొండ, కళ్యాణదుర్గం, గుత్తి ప్రాంతాల్లో ఎక్కువమంది ‘స్పౌజ్’ టీచర్లు పాయింట్లు ఎక్కువ ఉన్నాకూడా భర్త/భార్య పని చేస్తున్న కారణంగా దూరంగా వెళ్లారు.
● ఉరవకొండ మండలంలో భర్త పని చేస్తున్న స్కూల్లో ఖాళీగా ఉండడంతో ‘స్పౌజ్’ పాయింట్లు పొందిన భార్య పక్కన మరో స్కూల్ను కోరుకుంది. కొందరు అభ్యంతరం చెప్పడంతో భర్త పని చేస్తున్న స్కూల్కు వెళ్లాల్సి వచ్చింది.
● రాష్ట్ర కేడర్ కల్గిన ఉద్యోగులు జిల్లాలో పని చేస్తుంటే ‘స్పౌజ్’ కింద వారి సమీపంలోకి వెళ్లాల్సిందేనంటూ అధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో నార్పలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ భార్య అనంతపురం రూరల్ మండలంలో కోరుకోవాలని చూసినా...డీఈఓ ఒప్పుకోలేదు.
● శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పిన్నదరిలో భర్త సోషల్ టీచరుగా పని చేస్తున్నారు. భార్య దాడితోటలో ఎస్జీటీగా పని చేస్తోంది. పిన్నదరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బత్తలపల్లి మండలం మాల్యవంతం ఇవ్వాలని కోరినా.. మండలం వేరే అవుతున్న కారణంగా ఇవ్వడానికి సాధ్యంకాదని డీఈఓ తేల్చి చెప్పారు.
స్పష్టమైన ఆదేశాలు
‘స్పౌజ్’ పాయింట్లు పొందిన వారు ఇష్టానుసారంగా స్థానాలు కోరుకునేందుకు లేదు. ప్రత్యేకించి ఈ విషయంలో కమిషనర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ‘స్పౌజ్’ పని చేస్తున్న స్కూల్కు సమీపంలోకి వెళ్లాల్సిందే. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు. – ఎం.ప్రసాద్బాబు డీఈఓ, అనంతపురం
తప్పనిసరిగా ‘స్పౌజ్’ సమీపంలోకి
వెళ్లాల్సిందే
‘స్పౌజ్’ పాయింట్లు పొందినవారికంటే జనరల్ టీచర్లకు సౌకర్యవంతమైన స్కూళ్లు
ఎక్కువ పాయింట్లు ఉన్నా
దూరానికి వెళ్తున్న ‘స్పౌజ్’ టీచర్లు
నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్న విద్యాశాఖ
తలలు పట్టుకుంటున్న ‘స్పౌజ్’ టీచర్లు