1.10 లక్షల క్వింటాళ్లు | - | Sakshi
Sakshi News home page

1.10 లక్షల క్వింటాళ్లు

Jun 14 2025 10:16 AM | Updated on Jun 14 2025 10:16 AM

1.10 లక్షల క్వింటాళ్లు

1.10 లక్షల క్వింటాళ్లు

కూటమి సర్కారు పుణ్యమా అని అన్నదాతలు దగాకు గురవుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో సబ్సిడీ వేరుశనగ విత్తనకాయల పంపిణీలోనూ అన్యాయం చేస్తున్నారు. సర్కారుకు చిత్తశుద్ధి లేకపోవడం, అధికారుల కక్కుర్తి, ఏజెన్సీల ధనదాహం వెరసీ రైతులకు నాసిరకం విత్తనకాయలు అంటగట్టి నిలువునా ముంచుతున్నారు. ఏమాత్రమూ ప్రాసెసింగ్‌ చేయకుండానే విత్తనకాయలను ఏజెన్సీల నుంచి పంపిణీ కేంద్రాలకు సరఫరా చేసినట్లు స్పష్టమవుతోంది.
ఉమ్మడి అనంత జిల్లాకు కావాల్సిన వేరుశనగ విత్తన కాయలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: విత్తన కాయలను రైతుల దగ్గర కొని, శుద్ధి చేసి నాణ్యమైన వాటిని అందించే బాధ్యత ఏపీసీడ్స్‌ కార్పొరేషన్‌ది. అయితే, కొన్ని రోజులుగా విత్తన వేరుశనగను సేకరించి.. వాటిని శుద్ధి చేసే బాధ్యతలను కొన్ని ఏజెన్సీలకు అప్పజెబుతున్నారు. ఇక్కడే మతలబు మొదలైంది. సాధారణంగా ఏజెన్సీలకు ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ అనుమతులు ఇచ్చిన తర్వాతే విత్తన కాయల శుద్ధి, సరఫరా జరగాలి. కానీ కొన్ని ఏజెన్సీలకు అనుమతులు ఇవ్వకముందే విత్తనకాయల సరఫరా మొదలుపెట్టాయి. వాస్తవానికి శుద్ధి చేసిన తర్వాత నాణ్యమైన విత్తనకాయలను మాత్రమే రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కేల)కు తరలించాలి. అక్కడ రైతులకు పంపిణీ చేస్తారు. అయితే.. ఏమాత్రమూ ప్రాసెసింగ్‌ (శుద్ధి) చేయకుండానే నాసిరకం కాయలను సంచుల్లో నింపి పంపిస్తున్నారు.

ఏజెన్సీలు, అధికారుల కుమ్మక్కు

రైతులకు నాణ్యమైన విత్తనకాయలు అందేలా చూడాల్సిన ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ అధికారులు ఏజెన్సీలతో కుమ్మకై ్క తమ బాధ్యతలను గాలికొదిలేశారు. విత్తన కాయలు శుద్ధి అవుతున్నాయా, నాణ్యతగా ఉన్నాయా, లేదా అనేది ఎక్కడా పరిశీలించలేదు. ఏజెన్సీలు విత్తనకాయలను శుద్ధి చేసేందుకు అవసరమైన యంత్ర పరికరాలు ఉన్నాయో, లేదో వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించిన అనంతరం వాటికి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ వారు కూడా సరఫరా ఏజెన్సీల ఇష్టారాజ్యానికి వదిలేశారు. అసలు ఏమాత్రమూ శుద్ధి చేయకుండానే ఇప్పటివరకు రెండు జిల్లాల్లో పెద్దఎత్తున విత్తన కాయలను ఆర్‌ఎస్‌కేలకు చేర్చారు. అక్కడక్కడ అనుమానం వచ్చిన చోట్ల ఆర్‌ఎస్‌కే సిబ్బంది విత్తనకాయలను పరిశీలించి..నాణ్యత లేనివాటిని వెనక్కి పంపిస్తున్నారు.

దరఖాస్తు చేయకముందే

అనుమతి ఇచ్చారట!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీలో భాగంగా విత్తన శుద్ధి, ప్యాకింగ్‌, సరఫరాకు సంబంధించి మొత్తం 18 ఏజెన్సీలకు అనుమతులు మంజూరు చేశారు. ఇప్పటికే రైతులకు విత్తన పంపిణీ మొదలుపెట్టారు. అయితే..అనుమతులు రాకముందు నుంచే కొన్ని ఏజెన్సీలు విత్తనకాయల సరఫరా మొదలుపెట్టడం గమనార్హం. అధికారులు భరోసా ఇవ్వడం వల్లే ఇలా చేశాయన్నది స్పష్టమవుతోంది. ఈ ఏజెన్సీల్లో కదిరిలోని శ్రీ కార్తికేయ ఆగ్రో సీడ్స్‌ తో పాటు మరికొన్ని ఉన్నాయి. వాస్తవానికి ఇవి గత నెల 31న అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే..అంతకుముందే అంటే మే 26, 27వ తేదీనే అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేయకముందే అనుమతి ఎలా ఇచ్చారన్నది అంతుపట్టని విషయం. పైగా ఈ ఏజెన్సీలకు ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ను కూడా సీడ్‌ కార్పొరేషన్‌ డీఎం నియమించడం అనుమానాలకు తావిస్తోంది.

పావగడ నుంచి విత్తనకాయలు

ఉమ్మడి అనంతపురం జిల్లా సీడ్‌ కార్పొరేషన్‌ అధికారికి కర్ణాటకలోని పావగడ వద్ద ఓ విత్తన శుద్ధి ప్లాంటు ఉన్నట్టు సమాచారం. అక్కడి నుంచి విత్తనకాయలను అనుమతులు లేకుండా ఏజెన్సీలకు సరఫరా చేసి.. అక్కడి నుంచి రైతులకు ఇస్తున్నట్టు తెలుస్తోంది. విత్తనకాయల శుద్ధి, నాణ్యతపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు గానీ, కలెక్టర్ల పరిధిలో గానీ ఎలాంటి తనిఖీలు లేకపోవడంతో రైతులు దగాకు గురవుతున్నారు. ఏజెన్సీలు, సీడ్‌ కార్పొరేషన్‌ అధికారులు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్న చందాన వ్యవహారం నడుస్తోంది. ప్రొద్దుటూరుకు చెందిన సుబ్రమణ్యేశ్వర ఆగ్రోసీడ్స్‌ సంస్థను అడ్డుపెట్టుకుని ఇక్కడ సీడ్‌ కార్పొరేషన్‌ అధికారి భారీ దందా చేస్తున్నట్టు తెలిసింది.

టెండర్‌లో క్వాలిఫై అయ్యారని ఇచ్చారట..

విత్తన కాయల పంపిణీలో అక్రమాలపై సీడ్‌ కార్పొరేషన్‌ డీఎం రామసుబ్బయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆయన తికమక సమాధానాలు ఇచ్చారు. క్వాలిఫై అయింది కాబట్టి సుబ్రమణ్యేశ్వర ఆగ్రో సీడ్స్‌ తరఫున ఏజెన్సీకి ఇచ్చామని ఒకసారి, అవి వ్యవసాయశాఖ ఇచ్చిన అనుమతులని మరోసారి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం ఆలస్యమైందని ఆయన చెప్పడం కొసమెరుపు. దీంతో మొత్తం వ్యవహారంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.

ఇప్పటివరకూ సరఫరా అయినవి

ఇంకా రావాల్సినవి

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట సాగు

2.40లక్షలు పైనే

రైతులు

శెనిక్కాయ మాటున డబ్బుల గుటుక్కు

అనుమతులు రాకముందే ఏజెన్సీల నుంచి విత్తన కాయల సరఫరా

31న ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే 26నే అనుమతులు!

ప్రాసెసింగ్‌ చేయకుండానే విత్తనకాయల సరఫరా

మొత్తం వ్యవహారంలో ఓ అధికారిపై తీవ్ర విమర్శలు

కాసుల కక్కుర్తితో రైతులను నిండా ముంచుతున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement