
ఉపాధ్యాయులకు తప్పని జాగరణ
అనంతపురం ఎడ్యుకేషన్/పుట్టపర్తి: సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీల)కు జరుగుతున్న బదిలీల కౌన్సెలింగ్లో జాగరణ తప్పడం లేదు. వరుసగా మూడోరోజూ పడిగాపులు కాశారు. శుక్రవారం సీరియల్ నంబరు 1001 నుంచి 1800 దాకా పిలిచారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ రాత్రంతా కొనసాగింది. పరిశీలకులు సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు దగ్గరుండి పర్యవేక్షించారు.
భాషా పండితుల ఆందోళన
గత జగన్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది భాషా పండితులకు పదోన్నతులు కల్పిస్తే... ప్రస్తుత కూటమి సర్కార్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 90 మందికి పదోన్నతులు, బదిలీలు కల్పించటంలో పూర్తిగా విఫలమైందని పండిట్లు ధ్వజమెత్తారు. ఏటా బదిలీలు, సర్దుబాటు పేరుతో మానసిక వేదనకు గురి చేస్తున్నారని, శాశ్వత పరిష్కారం చూపాలంటూ ఆందోళన చేశారు. పదోన్నతులు, బదిలీల అంశంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ వరుసగా మూడో రోజు శుక్రవారం అనంతపురంలోని ఆర్డీటీ సమ్మిళిత పాఠశాలలో చేపట్టిన ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌన్సెలింగ్ను అడ్డుకోవడంతో ఆగిపోయింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను బయటకు వెళ్లాలని చెప్పడంతో... శాంతియుత నిరసన తెలియజేస్తామని చెప్పి ప్లకార్డులు పట్టుకుని మధ్యాహ్నం వరకు వరకూ వేదికపై కూర్చున్నారు. సంఘాల నాయకులు కలుగజేసుకోవడంతో.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పరిశీలకులు, డీఈఓ హామీ ఇచ్చారు.
ఓవైపు కౌన్సెలింగ్.. మరోవైపు ఆందోళన