
న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది
పెనుకొండ రూరల్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసినా.. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’ టీవీ డిబేట్లో ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలను కూటమి నేతలు ‘సాక్షి’కి ఆపాదించడంతో పాటు వ్యాఖ్యాతగా ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. 70 ఏళ్ల వయసున్న కొమ్మినేనిపై ప్రభుత్వం కక్ష కట్టి, కటకటాల పాలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. అందుకే ఆయనపై నమోదు చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ నమోదు చేయించిందన్నారు. చివరకు జడ్జి కల్పించుకుని ఆ సెక్షన్ను తీసివేయించారంటే సర్కార్ కక్షసాధింపు చర్యలు ఎంతలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగానే ప్రశ్నించే గొంతుకలను కూటమి నొక్కుతోందన్నారు. ఈ క్రమంలోనే కూటమి శ్రేణులను, మహిళా సంఘాలను రెచ్చగొట్టి ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు ఉసిగొల్పిందన్నారు. ఈ తతంగం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. నిజాలు నిర్భయంగా వెల్లడిస్తున్న ‘సాక్షి’పై, సీనియర్ జర్నలిస్టులపై కూటమి సర్కార్ ఎన్ని కుట్రలు చేసి ఇబ్బందులకు గురిచేసినా.. చివరికి న్యాయమే గెలిచిందన్నారు. సుప్రీం తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఉషశ్రీచరణ్ కోరారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్