
కొందరికే ‘వందనం’
పుట్టపర్తి అర్బన్: కూటమి సర్కార్ అట్టహాసంగా ప్రారంభించిన ‘తల్లికి వందనం’ పథకం కొందరికే పరిమితం కావడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హుల జాబితాలను శుక్రవారం సచివాలయాల్లో ప్రదర్శించగా...విద్యార్థుల తల్లిదండ్రులు పెద్దఎత్తున సచివాలయాలకు చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జాబితాలను చూస్తూ తమ పేర్లు వెతుక్కున్నారు. అయితే గతంలో ‘జగనన్న అమ్మఒడి’కి అర్హులై ఆర్థిక సాయం అందుకున్న చాలా మంది పేర్లు గల్లంతయ్యాయి. దీంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అర్హులమైన తాము..ఇప్పుడు ఎందుకు అర్హత సాధించలేకపోయామని సచివాలయ సిబ్బందిని ప్రశ్నించినా వారి నుంచి సమాధానం కరువైంది. ఒక్క పుట్టపర్తి మండలం పెడపల్లిలోనే సుమారు 300 మంది పేర్లు అర్హుల జాబితాలో కనిపించ లేదు. ఇక జిల్లా వ్యాప్తంగా ఈ లిస్టు వేలల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సర్కార్ చేసిన ‘అనర్హత’ మాయపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.2 వేలు కోత..
అర్హుల జాబితాలో ఉన్న వారికి కూడా రూ.15 వేలు కాకుండా రూ.13 వేలే జమ కావడంతో వారు కూడా పెదవి విరిచారు. ఎన్నికల సమయంలో స్వయంగా చంద్రబాబే కోతలు, వాతలు లేకుండా ‘తల్లికి వందనం’ కింద ఇంట్లో ఎంత మంది చదువుకుంటున్నా..రూ.15 వేల చొప్పున అందిస్తామని చెప్పారని, ఇప్పుడు పాఠశాల నిర్వహణ పేరుతో రూ.2 వేలు కోత విధించారంటున్నారు.
జాబితాల్లో కనిపించని అర్హుల పేర్లు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు