
తనకల్లు: మండలంలోని గంగసానివారిపల్లి సమీపంలో 42వ జాతీయ రహదారిపై మంగళవారం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. పుంగనూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మదనపల్లి నుంచి కదిరికి ప్రయాణికులతో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న కదిరికి చెందిన కుమార్, లక్ష్మీనారాయణ, మొలకలచెరువు నివాసి ఉత్తన్న, వేపలపల్లికి చెందిన రామాంజులు, పాలెంవాండ్లపల్లి వెంకటరమణకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వందేమాతరం టీం సభ్యులు తమ ఉచిత అంబులెన్స్లో క్షతగాత్రులను చికిత్స కోసం తనకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్న రామాంజులు, కుమార్ను కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
శతాధిక వృద్ధురాలి మృతి
పుట్టపర్తి: బుక్కపట్నం మండలం జానకంపల్లి గ్రామానికి చెందిన గండ్లూరి సాలమ్మ(106) సోమవారం రాత్రి మృతి చెందారు. ఆమెకు ముగ్గురు సంతానం కాగా, ఒకరైన అమరదీప్ అశ్వత్థరెడ్డి ఉమ్మడి జిల్లా వైఎస్సార్సీపీలో గుర్తింపు పొందిన నేతగా ఉన్నారు. మరణించే అరగంట ముందు వరకూ ఆమె ఎంతో ఉత్సాహంగా కుటుంబసభ్యులతో గడిపారు. సాలమ్మ మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత కొత్తకోట సోమశేఖరరెడ్డి, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రాచంరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు జానకంపల్లికి చేరుకుని ఆమె భౌతికకాయనికి నివాళులర్పించారు.
రైతు అనుమానాస్పద మృతి
పావగడ: తాలూకా పరిధిలోని చెన్నమరెడ్డిహళ్లికి చెందిన రైతు కురుబ లక్కప్ప(65) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంగళవారం ఉదయం గ్రామం నుంచి గుమ్మఘట్టకు వెళ్లే మార్గంలోని నిర్జన ప్రదేశంలో చెట్టుకు వేసుకున్న ఉరికి విగత జీవిగా వేలాడుతున్న లక్కప్పను గుర్తించిన స్థానికుల సమాచారంతో పావగడ పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సోమవారం రాత్రి ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినా... మృతుడి ముఖంపై గాయాలు, చొక్కాపై రక్తపు మరకలు ఉండడంతో కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ దిశగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.