
తాగునీటి కోసం రాస్తారోకో
కూడేరు: తాగునీటి కోసం కూడేరు వాసులు సోమవారం ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలోని బోయ, కమ్మ, దళిత, కటిక వీధులు, శ్రీసత్యసాయి కాలనీల్లో పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా కాలనీ వాసులు సోమవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కృష్ణమూర్తి మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న సీఐ రాజు అక్కడికు ఆందోళన కారులతో చర్చించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడుకోవాలని సూచించారు. అయితే అధికారులే వచ్చి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు తేల్చి చెప్పారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కుళ్లాయిస్వామి అక్కడకు చేరుకుని వారం రోజుల్లోపు కొత్తగా బోర్లు వేయించి, నీరు సరఫరా అయ్యేలా చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు.