
యోగా జీవితంలో భాగం కావాలి
ప్రశాంతి నిలయం: నిత్య జీవితంలో ఒత్తిడిని ఎదుర్కోవడంతో పాటు వివిధ రోగాల బారిన పడకుండా కాపాడే యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సూచించారు. ‘యోగాంధ్ర’ వేడుకలు ముగిసిన తర్వాత కూడా సమాజంలోని ప్రతి ఒక్కరూ యోగాను కొనసాగించేలా వారిలో చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణపై శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ టీఎస్ చేతన్ కలెక్టరేట్లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూన్ 21న జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని లేపాక్షిలో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో యోగాంధ్ర పోటీలు నిర్వహించాలన్నారు. ‘ప్రధాన మంత్రి సూర్యఘర్’ పథకం కింద సోలార్ రూఫ్టాప్ నిర్మించుకుంటే విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఇందుకోసం నియోజకవర్గస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ యోగా చేసేలా
చైతన్యం తీసుకురావాలి
అధికారులకు కలెక్టర్
టీఎస్ చేతన్ ఆదేశం