
సీబీఎస్ఈ అభ్యర్థులపై ‘తెలుగు’ పిడుగు
పుట్టపర్తి: డీఎస్సీలో సీబీఎస్ఈ అభ్యర్థులకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. పదో తరగతిలో లాంగ్వేజ్–1లో తెలుగు చదివి ఉండాలనే నిబంధనతో సీబీఎస్ఈ అభ్యర్థుల నెత్తిన పిడుగు వేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోనున్న 20 వేల మంది..
ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయటంతో పాటు డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 15తో తుది గడువుగా పేర్కొంది. దీంతో ఇబ్బడి ముబ్బడిగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది అభ్యర్థులు సీబీఎస్ఈ విధానంలో చదువుకున్నవారున్నారు. వీరంతా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు, ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసినవారే. అయితే డీఎస్సీ రాసే అభ్యర్థులు పదో తరగతిలో లాంగ్వేజ్–1లో తెలుగు చదివి ఉండాలనే నిబంధనను కూటమి ప్రభుత్వం చేర్చింది. వాస్తవానికి సీబీఎస్ఈ పదో తరగతిలో లాంగ్వేజ్–2 కింద తెలుగు ఉంటుందని, ఇక ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టే ఉండదనే విషయాన్ని కూటమి ప్రభుత్వం విస్మరించింది. దీంతో సీబీఎస్ఈ విధానం కింద చదువుకున్న రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన 3 వేల మంది అభ్యర్థులు ఉన్నారు. ఇదే విషయమై హెల్ప్లైన్ ద్వారా అధికారులను అభ్యర్థులు సంప్రదించారు. పదో తరగతిలో లాంగ్వేజ్–1లో తప్పనిసరిగా తెలుగు సబ్జెక్టు ఉండాలని తెలపడంతో దరఖాస్తులో ‘తెలుగు’ అని పేర్కొన్నారు. దీంతో దరఖాస్తును ఇప్పటికి ఆమోదించినప్పటికీ పోస్టుల భర్తీ సమయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్సీలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
నష్టపోనున్న 3 వేల మంది అభ్యర్థులు