
రెండోరోజూ ఎస్ఏ ఇంగ్లిష్ టీచర్ల ధర్నా
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ టీచర్ల ఖాళీలు పెంచాలని డిమాండ్ చేస్తూ రెండోరోజూ శుక్రవారం అనంతపురంలోని శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ధర్నా కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇంగ్లిష్ పదోన్నతుల అంశంపై హైకోర్టులో వేసిన కేసు పరిష్కారమైందన్నారు. 2023, జనవరి 26 నుంచి ఏప్రిల్ 30 వరకు రూ. 2,500 గౌరవ వేతనంతో తాత్కాలిక పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ టీచర్లుగా పనిచేసిన ఎస్జీటీలకు ఇంగ్లిష్ టీచర్లుగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం 230 ఖాళీలకు గాను కేవలం 19 మాత్రమే ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారని, వీటిని 2023లో తాత్కాలిక పద్ధతిలో ఇచ్చిన 230 స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతుల ఖాళీలుగానే చూపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీకి 30 శాతం కోటా 103 పోస్టులు కేటాయించి ఇందులో 70 శాతం ఇవ్వాల్సిన పదోన్నతులను కాదని కేవలం 19 మాత్రమే ఇస్తామనడం అన్యాయం అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి సూర్యుడు, చంద్రశేఖర్, నాగభూషణ, జయరాం నాయక్, జయపాల్ నాయుడు, సురేష్, నరసింహులు, మురళి, భాస్కర నాయుడు, రవి, విజయ శ్రీ, పరిమళ, తులసి, మాధవి,ఆదిలక్ష్మి, కౌసర్ బాను పాల్గొన్నారు. ధర్నాకు ఎస్టీయూ రమణారెడ్డి, రామాంజనేయులు, యూటీఎఫ్ నాగేంద్ర, పీఆర్టీయూ విష్ణువర్దన్రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్టీఏ నాగిరెడ్డి, శ్రీనివాసులు, రవినాయక్, నాగభూషణ, ఆర్ఈఎఫ్ నారాయణ నాయక్ మద్దతు తెలిపారు.