
ఖాద్రీశుడి సేవలో తెలంగాణ జడ్జి
కదిరి టౌన్: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మెట్రోపాలిటెన్ సిటీ సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి, ఆమె భర్త కిశోర్ కదిరి లక్ష్మీ నరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించి వారిని దుశ్శాలువాలతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.
రేపు పింఛన్ల పంపిణీ
పుట్టపర్తి అర్బన్: జూన్ నెల ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ నరసయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులు 2,66,986 మందికి రూ.114.86 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు ఈనెల 31వ తేదీ ఉదయం నుంచి పింఛన్లను పంపిణీ చేస్తారన్నారు.
జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డుల
గడువు పెంపు
ప్రశాంతి నిలయం: రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో 3 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మంజూరు చేసిన అక్రిడిటేషన్ కార్డుల గడువు మే 31 నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వుల మేరకు జూన్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అక్రిడిటేషన్ కార్డు కలిగివున్న జర్నలిస్టులకు మాత్రమే పొడిగింపు వర్తిస్తుందని పేర్కొన్నారు.
పక్కాగా ఆయుష్మాన్ భారత్
ప్రశాంతి నిలయం: ‘జిల్లాలో ఆయుష్మాన్ భారత్ స్కీంను పక్కాగా అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలి’ అని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు జిల్లా అమలు కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ వైద్యశాఖ అధికారి ఆధ్వర్యంలో వైద్యులు, మెడికల్ సిబ్బందితో ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యసేవలపై సమీక్షించాలన్నారు. కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం, వారి ఆరోగ్య ప్రయోజనాలు, వైద్య సంరక్షణను ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తోందన్నారు. అనంతరం హిందూపురం పట్టణంలోని బాలాజీ , స్పందన , రాఘవేంద్ర, తేజ ఆస్పత్రుల్లో పీఎంజేఎవై సేవలపై సమీక్షించారు. అలాగే కదిరి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీఎంఅండ్హెచ్ఓ ఫిరోజ్ బేగం, డీసీహెచ్ఎస్ మధుసూదన్, ఎన్టీఆర్ వైద్య సేవల జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
మహిళా డాక్టర్పై విచారణ
మడకశిర: పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని గురువారం డీసీహెచ్ఎస్ డాక్టర్ మధుసూదన్ సందర్శించారు. ఆస్పత్రిలో 2022లో పని చేసిన ఓ మహిళా డాక్టర్పై అప్పట్లో పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన విచారణ జరిపారు. మెడికల్ ఆఫీసర్ శశిరేఖ, ఆర్ఎంఓ దివాకర్ విచారణకు హాజరయ్యారు.

ఖాద్రీశుడి సేవలో తెలంగాణ జడ్జి