
పెరిగిన శ్రీవారి ఆలయ ఆదాయం
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు హుండీలో వేసిన కానుకలను బుధవారం ఆలయ, బ్యాంకు అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో లెక్కించారు. 62 రోజులుకు గాను రూ.1,10,69,573 నగదుతో పాటు 72 గ్రాముల బంగారు, 662 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో కంటే ఈసారి ఆలయ ఆదాయం పెరిగినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షణాధికారి ఎన్.ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ చలపతి, ఆలయాధికారులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీఫార్మసీ ఫలితాలు విడుదల
అనంతపురం: బీఫార్మసీ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్, మే నెలలో నిర్వహించిన బీఫార్మసీ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ, ఎమ్మెస్సీ మూడో సెమిస్టర్ (ఆర్–21) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. పరీక్ష ఫలితాల కోసం జేఎన్టీయూ(ఏ) వెబ్సైట్లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి. శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ ఎం. అంకారావు తదితరులు పాల్గొన్నారు.
కిడ్నాప్ కేసులో ఇద్దరి అరెస్ట్
ధర్మవరం రూరల్: బాలుడి కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను టూటౌన్ పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. ధర్మవరంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన నరసింహులు, సుమలత దంపతుల కుమారుడు శ్రీనాగచైతన్య అనే చిన్నారి మార్చి 24న ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండాపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే ఈ నెల పదో తేదీన నాగచైతన్య ఇంటికి తిరిగి వచ్చాడు. మిస్సింగ్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు లోతుగా విచారణ చేపడితే విస్తుపోయే విషయం వెలుగుచూసింది. బాలుడిని కిడ్నాప్ చేసింది మేనమామ ప్రశాంత్, అతని మామ వెంకటరాముడు అని తేలింది. ఈ రెండు కుటుంబాల మధ్య పాతకక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో సుమలత చిన్నకుమారుడైన నాగచైతన్యను ప్రశాంత్, వెంకటరాముడు దాచిపెట్టారని విచారణలో బయటపడింది. దీంతో డీఎస్పీ హేమంత్కుమార్ ఆదేశాల మేరకు సీఐ రెడ్డప్ప తన సిబ్బందితో వెళ్లి నిందితులిద్దరినీ బుధవారం అరెస్టు చేసి, రిమాండ్కు పంపించారు.
230 పోయి
19 పోస్టులు మిగిలాయి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ పదోన్నతుల టీచర్లకు తీరని అన్యాయం చేశారంటూ టీచర్లు వాపోయారు. 117 జీఓ ఆధారంగా వచ్చిన 230 ఇంగ్లిష్ పదోన్నతుల పోస్టులు ఇప్పుడు కేవలం 19 మాత్రమే మిగులుగా చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. బుధవారం స్థానిక శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో నిరసన తెలియజేశారు. విద్యాశాఖ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీఈఓ చాంబరును ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే రెంరేళ్లు సర్వీస్ కోల్పోయి నష్టపోయామని, 27 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండి ఒక్క ప్రమోషన్ కూడా లేకుండానే రిటైర్డ్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డీఓఈ ప్రసాద్బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీచర్లు జి.సూర్యుడు, రామాంజినేయులు, చంద్రశేఖర్, శ్రీనివాస నాయక్, జయరాం నాయక్, గోపాల్ రెడ్డి, శంకరమూర్తి, కేశవరెడ్డి, ఓబులేసు, లక్ష్మీనారాయణ, ధనలక్ష్మి, విజయ శ్రీ, నరసింహులు, ఓబిరెడ్డి, సూర్యనారాయణ, రసూల్ పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు ఎస్.నాగిరెడ్డి, జి.శ్రీధర్గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రవీంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణ, రాష్ట్ర కౌన్సిలర్ గోపాల్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన్ మద్దతు తెలిపారు.

పెరిగిన శ్రీవారి ఆలయ ఆదాయం