
పడిగాపులు.. చీకట్లో అగచాట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: హెచ్ఎంలుగా పదోన్నతులు తీసుకునేందుకు టీచర్లు గురువారం పడిగాపులు కాశారు. ఉదయం 11 గంటలకే శారదా నగర పాలక ఉన్నత పాఠశాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆశావాహులు చేరుకున్నారు. రాష్ట్ర అధికారుల నుంచి లింక్ రాలేదు.. జాబితా సిద్ధం చేస్తున్నాం తదితర కారణాలు చెబుతూ మధ్యాహ్నం 2 గంటలకు చేపడతామని స్వయంగా డీఈఓ ప్రకటించారు. ఈ క్రమంలో అందరూ భోజనం చేసుకుని 2 గంటలలోపే అక్కడికి చేరుకున్నా అప్పటికీ ప్రారంభం కాలేదు. సాయంత్రం 4 గంటలకు అంటూ మరోమారు ప్రకటించారు. తర్వాత 6 గంటలకు అని చెప్పినా అప్పటికీ ప్రారంభం కాలేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన టీచర్లు పడిగాపులు కాశారు. ఎట్టకేలకు రాత్రి 7 గంటల తర్వాత కౌన్సెలింగ్ ప్రారంభించారు. రాత్రి 10 గంటలకు ముగిసింది. మొత్తం 148 హెచ్ఎం పోస్టులకు గాను ఇందులో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన 3 పోస్టులకు ఆర్జేడీ కార్యాలయంలో పదోన్నతులు కల్పిస్తారు. తక్కిన జిల్లా పరిషత్, మునిసిపల్ యాజమాన్యాల పాఠశాలలకు సంబంధించిన 145 పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించి పదోన్నతులు కల్పించారు. ఇదిలాఉండగా కౌన్సెలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. చీకటి పడిన తర్వాత వెలుతురు సరిగా లేక టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీటి వసతి కూడా కల్పించలేదు. ముఖ్యంగా మహిళా టీచర్లు అగచాట్లు పడ్డారు.
133 మంది హెచ్ఎంల బదిలీలు..
వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 133 మంది ప్రధానోపాధ్యాయులు బదిలీ అయ్యారు. మొత్తం 191 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 29 మంది తప్పనిసరి బదిలీ కాగా...162 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 104 మంది బదిలీ కాగా తక్కిన 58 మంది బదిలీ కాలేదు.
ఆలస్యమైన సీనియార్టీ జాబితా..
స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితా శుక్రవారం విడుదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి రెండు రోజుల కిందటే జాబితా సిద్ధం కావాల్సి ఉన్నా...హెచ్ఎం పదోన్నతుల కౌన్సెలింగ్ ఉన్న కారణగా ఆలస్యమవుతోందని ఉద్యోగులు చెబుతున్నారు.
ఎక్కువ పాయింట్ల నమోదుపై జాగ్రత్త..
ఉపాధ్యాయుల పాయింట్ల నమోదును ఎంఈఓలు జాగ్రత్తగా పరిశీలించాలని డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రావాల్సిన పాయింట్ల కంటే ఎక్కువ వచ్చి ఉంటే అలాంటి వారితో గ్రీవెన్స్ పెట్టించి తగ్గించుకునేలా చూడాలని ఆదేశించారు. తర్వాత ఎక్కువ పాయింట్లు వచ్చినట్లు ఫిర్యాదులు వస్తే మాత్రం క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
స్కూల్ అసిస్టెంట్ నుంచి
హెచ్ఎంలుగా పదోన్నతుల కౌన్సెలింగ్
ఉదయం నుంచి రాత్రిదాకా
వేచిఉన్న టీచర్లు
ఎట్టకేలకు రాత్రి 7 గంటలకు
ప్రారంభమై 10 గంటలకు పూర్తి

పడిగాపులు.. చీకట్లో అగచాట్లు

పడిగాపులు.. చీకట్లో అగచాట్లు