
భక్తుడిపై సెల్ఫోన్ కౌంటర్ నిర్వాహకుడి దురుసు ప్రవర్త
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో తనపై సెల్ఫోన్ కౌంటర్ నిర్వాహకుడు దురుసుగా ప్రవర్తించాడంటూ తాడిపత్రికి చెందిన ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. డాక్టర్గా పనిచేస్తున్న తన కుమారుడికి వివాహం నిశ్చయం కావడంతో తొలి ఆహ్వాన పత్రికను స్వామి వారి సన్నిధిలో ఉంచేందుకు భార్యతో కలసి కసాపురం వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో టెంకాయలు కొనుగోలు చేసిన చోటనే చెప్పులు, సెల్ఫోన్లు పెట్టి ఆలయంలోకి ప్రవేశిస్తుండగా సెల్ఫోన్ కౌంటర్ నిర్వాహకుడు మొబైల్ పెట్టి వెళ్లాలంటూ దబాయించాడన్నారు. తన వద్ద సెల్ఫోన్ లేదని చెప్పినా వినకుండా దౌర్జన్యానికి దిగాడన్నారు. దీంతో తాను అసహనం వ్యక్తం చేయడంతో నేరుగా వచ్చి చొక్కా పట్టుకుని చెప్పుతో కొడతానంటూ దాడికి యత్నించాడన్నారు. ఆ సమయంలో పక్కన ఉన్న భక్తులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగిందన్నారు. ఘటనపై ఆలయ ఈఓకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే అందుబాటులో లేరని, ఆలయం బయటకు వచ్చిన తర్వాత ఈఓ సెల్ఫోన్ నంబర్కు కాల్ చేసినా అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఈఓకు ఫోన్ చేస్తే ఆయన హైదరాబాద్లో ఉన్నట్లుగా తెలిపారన్నారు. స్వామి దర్శనార్థం వచ్చే భక్తులపై ఆలయ సిబ్బంది దురుసుగా వ్యవహరించడం, ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికై నా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.