
శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు
పుట్టపర్తి టౌన్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్న పోలీస్ అధికారులను ఆదేశించారు. నేరస్తులకు శిక్ష పడేలా సమగ్ర విచారణ జరపాలన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్సు హాలులో డీఎస్పీలు, సీఐలతో ఎస్పీ రత్న నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. గ్రేవ్, నాన్గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ, పోక్సో, మర్డర్, చోరీ కేసులపై సమీక్షించారు. అనంతరం కేసులు పురోగతిలో ప్రతిభ కనబరచిన పోలీసులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న మాట్లాడుతూ...పోలీసులు గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలన్నారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వివిధ స్టేషన్ల పరిధిలో నమోదయ్యే కేసుల వివరాలు ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో పొందుపరచాలన్నారు. వేసవిలో చోరీల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనుమానిత వ్యక్తులు కదలికలతో పాటు వాహనాల తనిఖీలు పెంచాలన్నారు. పోక్సో, లైంగిక దాడుల కేసుల్లో పక్కా సాక్ష్యాధారాలను కోర్టులకు సమర్పించి నేరస్తులకు శిక్షపడేలా చూడాలన్నారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కేసు నమోదైన 60 రోజుల్లోపు కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఉమెన్ హెల్ప్ డెస్క్ ద్వారా అందే ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. పోలీస్ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాలో నేరాల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీలు విజయకుమార్, శివన్నారాయణస్వామి, నరసింగప్ప, హేమంత్కుమార్, లీగల్ అడ్వయిజర్ సాయినాథ్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, ఎస్ఐ ప్రదీప్ కుమార్ పాటు సిబ్బంది పాల్గొన్నారు.
నేరస్తులకు శిక్ష పడేలా
సమగ్ర విచారణ చేయండి
కేసుల దర్యాపు వేగవంతం కావాలి
నేర సమీక్షలో ఎస్పీ రత్న

శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు