దుత్తలూరు: మండలంలోని తెడ్డుపాడు బీసీ కాలనీ సమీ పాన 565 జాతీయ రహదారిపై వంతెన గోడను టిప్పర్ ఢీకొట్టిన ఘటన ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన టిప్పర్ ఇసుక కోసం పెన్నానది ప్రాంతానికి వెళ్తోంది. ఈ తరుణంలో టిప్పర్ తెడ్డుపాడు బీసీ కాలనీ వద్దకు రాగానే అదుపుతప్పి వంతెన గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ క్యాబిన్ ఊడి వంతెన కింద కాలువలో పడిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ నాగరాజును బయటకు తీశారు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం 108 వాహనానికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.


