
చెడు వ్యసనాలకు బానిసై చిత్రహింసలు
నెల్లూరు(క్రైమ్): ‘నా చిన్న కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై నగదు కోసం చిత్రహింసలు పెడుతున్నాడు. అతడి బారి నుంచి రక్షణ కల్పించండి’ అని అల్లూరుకు చెందిన ఓ వృద్ధురాలు కోరారు. సోమవారం నెల్లూరులోని పోలీస్ కవాతు మైదానంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 104 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ జి. కృష్ణకాంత్కు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన ఆయా ప్రాంత పోలీస్ అధికారులతో మాట్లాడి చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, కావలి డీఎస్పీ పి.శ్రీధర్, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, బి.శ్రీనివాసరెడ్డి, వెల్ఫేర్ ఆర్ఐ రాజారావు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● నా కుమారుడికి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని పోలీస్ కాలనీకి చెందిన శివయ్య రూ.15 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మోసగించాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ వినతిపత్రం ఇచ్చారు.
● నేను జొన్నవాడలోని ఓ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఓ మహిళ పూజ చేయించుకున్నారు. అనంతరం నా నంబర్ను తీసుకుని తరచూ ఫోన్లు చేస్తూ చెప్పినట్లు వినాలని లేనిపక్షంలో పరువు తీస్తానని బెదిరిస్తోంది. నా కుటుబ సభ్యులు, బంధువులకు అసత్య మెసేజ్లు పంపుతూ బెదిరిస్తోందని నెల్లూరు దర్గామిట్టకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● రెండు నెలల్లో నా ఇంటిపై రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు లోన్ ఇప్పిస్తానని నగరానికి చెందిన షేక్ జానీ నమ్మించి రూ.3 లక్షలు తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా లోన్ ఇప్పించకపోగా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నాడని నవాబుపేటకు చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు.
● నా కుమారుడు లండన్లో చదువుతున్నాడు. అతడికి రూ.1.02 లక్షలు పంపించాలని చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఉన్న ఓ కంపెనీకి చెందిన అవినాష్రెడ్డిని సంప్రదించాను. ఆయన పంపుతానని నగదు తీసుకుని మోసగించారు. డబ్బు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడని బాలాజీనగర్కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● కోవూరుకు చెందిన రషీద్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి కోరారు.
● అనిల్ అనే వ్యక్తి వేధిస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ప్రవర్తనలో మార్పు రాలేదు. అతని బారి నుంచి రక్షణ కల్పించాలని సంగం ప్రాంతానికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
● అదనపుకట్నం కోసం నా భర్త వేధిస్తున్నాడు. కౌన్సెలింగ్ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని వింజమూరుకు చెందిన ఓ మహిళ కోరారు.
కుమారుడిపై వృద్ధురాలి ఫిర్యాదు
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరించిన ఎస్పీ