
దళితుల భూములపై టీడీపీ నేత కన్ను
చేజర్ల(ఆత్మకూరు): దళితులకు ఐదు దశాబ్దాల క్రితం ప్రభుత్వం కేటాయించిన భూములపై టీడీపీ నేత కన్ను పడింది. ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సోదరుడు కొమ్మి సిద్ధులు నాయుడు ఆ భూములను ఆక్రమించేందుకు, దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. వారి వివరాల మేరకు.. చేజర్ల మండలం పెళ్లేరు పంచాయతీ మజరా పుల్లనీళ్లపల్లి గ్రామంలో సర్వే నంబర్ 511లో మాజీ సైనికుడు చేజర్ల పెంచలయ్యకు 5 ఎకరాల భూమిని మంజూరు చేశారు. అదే క్రమంలో గ్రామంలోని పలువురు దళితులకు సుమారు 38 ఎకరాలు భూ పంపిణీలో దక్కాయి. పెంచలయ్య తన భూమిని 2008లో ఇద్దరు కుమార్తెలకు రిజిస్ట్రేషన్ చేసిచ్చాడు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక సిద్ధులు నాయుడు పొలాల సర్వే నంబర్లను తారుమారు చేసి మొత్తం 43 ఎకరాలను తన కుటుంబ సభ్యుల పేర్లతో అడంగళ్లో ఎక్కించాడు. దీని విషయమై అప్పటి నుంచి బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పెంచలయ్య కుమార్తెలు దొంతాలి పెంచలమ్మ, చిట్టెమ్మలు హైకోర్టులో 2021లో కేసు దాఖలు చేశారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. సిద్ధులు నాయుడు ఆ భూమిని తమకు కౌలుకు ఇచ్చారంటూ ఆదివారం టీడీపీకి చెందిన చోటా నేతలు చిన్నం పరంధామయ్య, పెంచల ప్రసాద్, చిన్నం ప్రేమ్కుమార్, ఐతా హరిబాబు దౌర్జన్యంగా దున్నేందుకు ప్రయత్ని ంచారు. బాధిత కుటుంబాల వారు అడ్డుకున్నారు. ఓవైపు హైకోర్టు ఆదేశాల మేరకు పొలంలో ఎవరూ దిగరాదని, రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు పెట్టినా లెక్క చేయకుండా దున్నేందుకు ప్రయత్నిస్తున్నట్లు దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. టీడీపీ నేతల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
అధికారులకు బాధితుల ఫిర్యాదు
రక్షణ కల్పించాలని వినతి