
స్వర్ణాంధ్రప్రదేశ్కు సహకరించండి
ఆత్మకూరు: రాష్ట్ర అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రజల సహకారంతోనే సాధ్యమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ప్రజావేదికలో చంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఏర్పాటైతే యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుందని, ఆ దిశగా ఆలోచన చేసి గడిచిన పది నెలల్లో రూ.8.50 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అమరావతిని వరల్డ్ క్లాస్ కేపిటల్ సిటీగా రూపుదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలో రూ.లక్ష కోట్లతో బీపీసీఎల్ కంపెనీ, ఇండోసోల్ కంపెనీలు ఏర్పాటు కానున్నాయన్నారు. దగదర్తి ఎయిర్పోర్ట్ త్వరలో ఏర్పాటు కానుందని, కృష్ణపట్నం, రామాయపట్నం పోర్ట్లు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. పారిశ్రామిక ప్రగతికి అవి ఎంతో దోహదపడతాయన్నారు. ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సీఎం చంద్రబాబు శాలువా కప్పి సన్మానించారు. మార్గదర్శి, బంగారు కుటుంబం కార్యక్రమంలో దాతలైన మార్గదర్శిలను ఆయన అభినందించి శాలువా కప్పి సన్మానించారు. నెల్లూరుపాళెం గిరిజనకాలనీలో గిరిజన వితంతువు సుస్మితకు పింఛన్ అందజేశారు. సమీపంలోని భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులతో కొద్దిసేపు మాట్లాడారు. తిరుగు ప్రయాణంలో టిడ్కో గృహ సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తలతో చర్చించారు.
పైలాన్ ఆవిష్కరణ
ఆత్మకూరురూరల్: మండలంలోని నారంపేట వద్ద ఎంఎస్ఎంఈ పార్కు వద్ద సీఎం చంద్రబాబు గురువారం పలువురు మంత్రులు, అధికారులతో కలిసి పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభోత్సవం, 39 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలను వర్చువల్గా నిర్వహించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు, ఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి, కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, ఆత్మకూరు, నెల్లూరు, కందుకూరు ఆర్డీఓలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు