వెస్టిండీస్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో తొలి మూడు వన్డేల కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు షాయ్ హోప్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
అయితే ఈ జట్టు ఎంపిక సందర్భంగా సెలక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ విటెల్ లావ్స్కు తొలిసారి విండీస్ జాతీయ జట్టులో సెలక్టర్లు చోటు కల్పించారు. 19 ఏళ్ల విటెల్ లావ్స్కు ఇప్పటివరకు దేశవాళీ క్రికెట్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినప్పటికి అతడిని నేరుగా జాతీయ జట్టుకు ఎంపిక చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఒకవేళ లావ్స్ న్యూజిలాండ్ సిరీస్లో అరంగేట్రం చేస్తే.. అది అతడి మొదటి లిస్ట్-ఎ క్రికెట్ మ్యాచ్ అవుతోంది. అయితే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 వన్డే ప్రపంచకప్లో మాత్రం విండీస్ తరపున అద్భుతంగా రాణించాడు.
ఈ టోర్నీలో మొత్తంగా పది వికెట్లు పడగొట్టి.. ప్రత్యర్ధి బ్యాటర్లకు తన స్పిన్ మయాజాలంతో ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే అతడిని సెలక్టర్లు తొలిసారి నేషనల్ టీమ్కు ఎంపిక చేశారు. భవిష్యత్తు ప్రణాళికల దృష్ట్యా లావ్స్ను జట్టులోకి తీసుకున్నట్లు విండీస్ హెడ్కోచ్ డారన్ సామీ తెలిపాడు.
స్టార్ ఆల్రౌండర్ రీఎంట్రీ
ఇక ఈ సిరీస్కు స్టార్ ప్లేయర్ షిమ్రాన్ హెట్మైర్ దూరమయ్యాడు. హెట్మైర్ ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ టీ20లీగ్లో ఆడుతున్నాడు. అదేవిధంగా ఆల్రౌండర్ కీమో పాల్ దాదాపు మూడేళ్ల తర్వాత విండీస్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
స్ప్రింగర్ స్ధానంలో అతడికి ఛాన్స్ ఇచ్చారు. కీమో పాల్కు అద్భుతమైన ఆల్రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. అతడు లోయార్డర్ బ్యాటింగ్కు వచ్చి మెరుపులు మెరిపించగలడు. బంతితో కూడా మ్యాజిక్ చేసే సత్తా అతడికి ఉంది. ఈ ఐదు వన్డేల సిరీస్ జూలై 12 నుంచి గయానా వేదికగా ప్రారంభం కానుంది.
కివీస్తో తొలి మూడు వన్డేలకు విండీస్ జట్టు
షాయ్ హోప్ (కెప్టెన్), అకీమ్ ఆగస్ట్, జాన్ క్యాంప్బెల్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జంగూ, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, విటెల్ లాస్, గుడాకేశ్ మోటీ, కీమో పాల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, జేడెన్ సీల్స్.


