గత కొన్నేళ్లుగా దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటలేక చతికిలపడుతోంది తమిళనాడు క్రికెట్ జట్టు. ఈ నేపథ్యంలో తమిళనాడు క్రికెట్ సంఘం శిక్షణ బృందాన్ని బలోపేతం చేసే పనిలో పడింది.
వరుస వైఫల్యాలు
కాగా గత రంజీ సీజన్లో గ్రూప్ దశలో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న తమిళనాడు జట్టు... సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో సూపర్ లీగ్ దశకు చేరలేకపోయింది. దీంతో కోచింగ్ స్టాఫ్ను మార్పు చేయాలని భావించిన తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ) కొత్త కోచ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పురుషుల, మహిళల విభాగాల్లో సీనియర్, జూనియర్ జట్లకు కొత్త కోచ్లను నియమించనుంది. అలాగే సెలెక్షన్ కమిటీ సభ్యులను సైతం ఎంపిక చేయనుంది. ఈ నెల 10 దరఖాస్తులకు చివరి తేదీ కాగా... పరిమిత ఓవర్లకు, టెస్టు ఫార్మాట్కు వేర్వేరు కోచ్లను ఎంపిక చేయనుంది.
ఉండాల్సిన అర్హతలు ఇవే
కాగా 60 సంవత్సరాలకు లోబడి ఉండి బీసీసీఐ లెవల్–2 కోచింగ్ సర్టిఫికెట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎన్సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ‘నిబంధనల ప్రకారం కొత్త కోచ్ల నియామకం చేపడతాం.
వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం తదుపరి పరీక్షలు నిర్వహిస్తాం’ అని టీఎన్సీఏ కార్యదర్శి భగవాన్ దాస్ తెలిపారు. ప్రస్తుతం తమిళనాడు జట్లకు సెంథిల్నాథన్, వెంకటరమణ కోచ్లుగా వ్యవహరిస్తున్నారు.


