సౌతాఫ్రికా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ను నియంత్రిస్తుందని ఆరోపించాడు. భారత్ వాణిజ్య శక్తి కారణంగా అంతర్జాతీయ క్రికెట్పై భారీ ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డాడు.
అంతర్జాతీయ క్రికెట్లో శక్తి సమతౌల్యం ఇంకా మారలేదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఇంగ్లండ్లోని ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైమన్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఆ విజయం తర్వాత కూడా మారని సమీకరణలు
గతేడాది లార్డ్స్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి టెస్ట్ ఛాంపియన్గా అవతరించింది. 1991-92లో క్రికెట్లోకి తిరిగి వచ్చిన తర్వాత వారికి ఇది తొలి రెడ్బాల్ టైటిల్.
అయితే ఈ విజయం తర్వాత కూడా ప్రపంచ క్రికెట్లో శక్తి సమతౌల్యత మారలేదన్నది సైమన్ అభిప్రాయం. ఐసీసీపై ఇంకా భారత్ పెత్తనమే కొనసాగుతుందన్నది అతని వాదన. బీసీసీఐ ధనబలంతో ఐసీసీని నియంత్రిస్తోందన్నది అతని వాదన.
బవుమా, కాన్రాడ్పై ప్రశంసలు
ఇదే సందర్భంగా సైమన్ తన సొంత జట్టు సభ్యులపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోచ్ షుక్రి కాన్రాడ్, కెప్టెన్ టెంబా బవుమాను ఆకాశానికెత్తాడు. వారి జట్టు ఒకరిద్దరి స్టార్ ప్లేయర్ల జట్టు కాదని.. కోచ్ ప్రతి విషయాన్ని నేరుగా మాట్లాడటం చాలా నచ్చిందని చెప్పుకొచ్చాడు.
ఇంగ్లండ్ వ్యవస్థపై కూడా విమర్శలు
సైమన్ ఇంగ్లండ్ క్రికెట్ వ్యవస్థపై కూడా విమర్శలు గుప్పించాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టులో స్పిన్నర్లకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించాడు. కౌంటీ క్రికెట్ నిర్మాణం వల్ల వారు లీడర్షిప్ పాత్రలో ఎదగలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు.
మొత్తంగా సైమన్ తన వ్యాఖ్యల్లో బీసీసీఐ పెత్తనం చేస్తోందని, ఇంగ్లండ్ క్రికెట్ వ్యవస్థలో లోపాలున్నాయని అన్నాడు. సైమన్ గతేడాది స్వదేశంలో టీమిండియాను ఓడించిన (టెస్ట్ సిరీస్) జట్టులో సభ్యుడు.


