Suryakumar Yadav: ద్రవిడ్‌ ప్రణాళికలు... సూర్యకుమార్‌కు బంపరాఫర్‌!.. దక్షిణాఫ్రికాకు శార్దూల్‌?!

Shardul Thakur to Join India A Squad Suryakumar Included NZ Test Series Reports - Sakshi

Suryakumar Yadav asked to stay back with team for NZ Tests- Reports: టీమిండియా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లనున్నాడా? భారత ‘ఏ’ జట్టుతో ప్రొటీస్‌ ఆడనున్న టెస్టు జట్టులో భాగస్వామ్యం కానున్నాడా? ‘షేర్‌’దూల్‌ సంగతి ఇలా ఉంటే మరో ముంబై బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టెస్టుల్లో అరంగేట్రానికి రంగం సిద్ధమైందా? న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడు అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉందా? అంటే అవుననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. 

టీమిండియా కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి రోహిత్‌ సేన సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇదే జోష్‌లో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. అయితే, ఏ మ్యాచ్‌(అధికార, అనధికార సిరీస్‌లు) ఆడుతున్నారన్న అంశంతో సంబంధం లేకుండా ప్రతి ఆటగాడిని అన్ని ఫార్మాట్లకు సన్నద్ధంగా ఉంచేలా వివిధ మ్యాచ్‌లు ఆడించేందుకు ద్రవిడ్‌ ప్రణాళికలు రచిస్తున్నాడట. 

ఇందులో భాగంగానే శార్దూల్‌ను దక్షిణాఫ్రికాకు పంపాలని భావిస్తున్నారట. డిసెంబరు 6 నుంచి ఆరంభం కానున్న మూడో టెస్టుకు సిద్ధంగా ఉండాలని శార్దూల్‌కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తన వంతు పాత్ర పోషించిన శార్దూల్‌ను తదుపరి సిరీస్‌లకు సన్నద్ధం చేసేందుకు(ప్రాక్టీసు) ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారట.

ఇక సూర్యకుమార్‌ విషయానికొస్తే... న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు ముందు ప్రకటించిన జట్టులో అతడికి స్థానం కల్పించలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. మొదటి టెస్టులో అతడిని ఆడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాన్పూర్‌ వేదికగా జరిగే తొలి టెస్టులో ఈ ముంబైకర్‌ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే ఛాన్స్‌ ఉందని.. రెండు మ్యాచ్‌లలోనూ అతడిని ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రచురించింది. ఇక మంగళవారం నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ ‘ఏ’ జట్టు అనధికారిక సిరీస్‌ ఆరంభం కానుండగా.. నవంబరు 25 నుంచి భారత్‌- న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ మొదలుకానుంది.

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత టెస్టు జట్టు: 
అజింక్య రహానే (కెప్టెన్‌), రాహుల్, మయాంక్‌ అగర్వాల్, పుజారా, శుబ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, సాహా (వికెట్‌ కీపర్‌), శ్రీకర్‌ భరత్, జడేజా, అశ్విన్, అక్షర్‌ పటేల్, జయంత్‌ యాదవ్, ఇషాంత్, ఉమేశ్‌ యాదవ్, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ. 

చదవండి: Shreyas Iyer- Mohammed Siraj: ఏమైనా మాట్లాడండి సర్‌.. ఆట పట్టించిన శ్రేయస్‌.. కార్డు పడేసి వెళ్లిపోయిన సిరాజ్‌!
Rahul Dravid: నా ఫస్ట్‌లవ్‌ ద్రవిడ్‌.. తన కోసం మళ్లీ క్రికెట్‌ చూస్తా: నటి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top