క్యాచ్‌ మిస్‌ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు | Sakshi
Sakshi News home page

క్యాచ్‌ మిస్‌ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు

Published Sat, Dec 26 2020 10:24 AM

Ravindra Jadeja Stunnig Catch After Collision With Gill In Melbourne - Sakshi

మెల్‌బోర్న్‌ : టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మెరుపు ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన జడేజా మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టు ద్వారా మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రావడంతోనే ఫీల్డింగ్‌ నైపుణ్యం ప్రదర్శిస్తూ స్టన్నింగ్‌ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. అసలు విషయంలోకి వెళితే.. రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్‌ భారీ షాట్‌ ఆడాడు. (చదవండి : బాక్సింగ్‌ డే టెస్టు : స్టీవ్‌ స్మిత్‌ డకౌట్‌)

మిడాన్‌లో ఉన్న జడేజా క్యాచ్‌ అందుకోవడానికి పరిగెత్తుకు రాగా.. కమ్యునికేషన్‌ గ్యాప్‌ రావడంతో మిడాఫ్‌లో ఉన్న గిల్‌ కూడా పరిగెత్తుకు వచ్చాడు. జడేజా క్యాచ్‌ను అందుకునే క్రమంలో అతని చేయి గిల్‌ను తాకింది. దీంతో క్యాచ్‌ మిస్సవుతుందని అంతా భావించారు. కానీ జడేజా మాత్రం బంతిని వదలకుండా చేతిలోనే ఒడిసిపట్టుకోవడంతో వేడ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ వీడియోనూ క్రికెట్‌ ఆస్ట్రేలియా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. క్యాచ్‌ మిస్‌ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు. అంటూ క్యాప్షన్‌ జత చేసింది. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆసీస్‌ టీ విరామం అనంతరం 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌ 7, కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్‌ గెలిచిన ఆసీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా.. టీమిండియా బౌలర్‌ బుమ్రా ఆసీస్‌ ఓపెనర్‌ బర్న్స్‌ను డకౌట్‌ చేశాడు.దీంతో ఆసీస్‌ 10 పరుగుల వద్ద మొదటి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మార్నస్‌ లబుషేన్‌తో కలిసి మరో ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేశాడు. వీరి జోడి బలపడుతున్న తరుణంలో బౌలింగ్‌కు వచ్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌ వేడ్‌ను 30 పరుగుల వద్ద ఔట్‌ చేయడంతో ఆసీస్‌ 35 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. (చదవండి : బాక్సింగ్‌ డే టెస్టు : స్టీవ్‌ స్మిత్‌ డకౌట్‌)

ఈ దశలో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్‌ స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఆసీస్‌ 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హెడ్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. లబుషేన్‌,హెడ్‌లు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఆచితూచి ఆడారు. టీ విరామానికి ముందు బుమ్రా బౌలింగ్‌లో 38 పరుగులు చేసిన హెడ్‌ ఔట్‌ కాగా.. కాసేపటికే అర్థసెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్న లబుషేన్‌ను సిరాజ్‌ ఔట్‌ చేయడంతో ఆసీస్‌ 5 వికెట్లు కోల్పోయింది. కాగా సిరాజ్‌ లబుషేన్‌ను అవుట్‌ చేయడం ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో మెయిడెన్‌ వికెట్‌ తీశాడు. భారత బౌలర్లలో అశ్విన్‌ 2, బుమ్రా 2, సిరాజ్‌ ఒక వికెట్‌ తీశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement