పతాకధారులుగా మేరీకోమ్, మన్‌ప్రీత్‌

Mary Kom, Manpreet Singh to be India flag-bearers at Tokyo Olympics - Sakshi

టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో భారత బృందానికి మహిళా దిగ్గజ బాక్సర్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ నాయకత్వం

మరో 17 రోజుల్లో

న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన దిగ్గజ మహిళా బాక్సర్‌ మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈనెల 23న జరిగే టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో వీరిద్దరు భారత బృందానికి పతాకధారులుగా (ఫ్లాగ్‌ బేరర్స్‌) వ్యవహరించనున్నారు. ఈ మేరకు మేరీకోమ్, మన్‌ప్రీత్‌ సింగ్‌ పేర్లను ఖరారు చేస్తూ టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహకులకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) సమాచారం ఇచ్చింది. ఆగస్టు 8న ఒలింపిక్స్‌ ముగింపు ఉత్సవంలో భారత బృందానికి స్టార్‌ రెజ్లర్, ప్రస్తుత ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల చాంపియన్‌ బజరంగ్‌ ఫ్లాగ్‌ బేరర్‌గా ఉంటాడని ఐఓఏ తెలిపింది. ఇప్పటివరకైతే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి 18 క్రీడాంశాల్లో మొత్తం 115 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు.

లింగ సమానత్వం పాటించాలనే సదుద్దేశంతో ఈసారి నుంచి ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో ఆయా దేశాలు ఇద్దరు చొప్పున (1 మహిళ, 1 పురుషుడు) క్రీడాకారులకు పతాకధారులుగా వ్యవహరించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో షూటర్‌ అభినవ్‌ బింద్రా భారత బృందానికి ఫ్లాగ్‌ బేరర్‌గా వ్యవహరించాడు. బింద్రా 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గి విశ్వ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం నెగ్గిన ఏకైక భారతీయ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.

బాక్సింగ్‌కే మణిహారం...
మణిపూర్‌కు చెందిన 38 ఏళ్ల మేరీకోమ్‌ కెరీర్‌లో చివరిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనుంది. దాంతో ఆమెకు గౌరవప్రద వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఐఓఏ ఫ్లాగ్‌ బేరర్‌గా ఎంపిక చేసింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన మేరీకోమ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. 2014 ఆసియా క్రీడల్లో... 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో పసిడి పతకాలు నెగ్గిన మేరీకోమ్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు కూడా గెల్చుకుంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న మేరీకోమ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్‌ (2020), పద్మభూషణ్‌ (2013), పద్మశ్రీ (2006) పౌర పురస్కారాలు.. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న–2009’ ‘అర్జున అవార్డు–2003’ కూడా లభించాయి.  

అంచెలంచెలుగా...
పంజాబ్‌లోని జలంధర్‌ పట్టణానికి చెందిన 28 ఏళ్ల మన్‌ప్రీత్‌ సింగ్‌ 2011లో తొలిసారి భారత సీనియర్‌ పురుషుల హాకీ జట్టులోకి వచ్చాడు. హాఫ్‌ బ్యాక్‌ పొజిషన్‌లో ఆడే మన్‌ప్రీత్‌ 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో, 2016 రియో ఒలింపిక్స్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ అతనే భారత్‌కు సారథ్యం వహించనున్నాడు. ఇప్పటి వరకు 269 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఆడిన మన్‌ప్రీత్‌ 22 గోల్స్‌ చేశాడు. 2019లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ‘ఉత్తమ ప్లేయర్‌’ అవార్డు పొందిన తొలి భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన మన్‌ప్రీత్‌ సారథ్యంలో 2019లో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో విజేతగా నిలిచి ‘టోక్యో’ బెర్త్‌ సంపాదించింది. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజతం నెగ్గిన భారత జట్టులో మన్‌ప్రీత్‌ సభ్యుడిగా ఉన్నాడు.  

నా కెరీర్‌లోని చివరి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న సందర్భంగా ఈ గౌరవం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఓఏకు, కేంద్ర క్రీడా శాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరోసారి పతకం సాధించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను.    
–మేరీకోమ్‌

భారత్‌ తరఫున ఒలింపిక్స్‌ క్రీడల ప్రారంభోత్సవంలో పతాకధారిగా వ్యవహరించనున్న మూడో మహిళా క్రీడాకారిణి మేరీకోమ్‌. గతంలో అథ్లెట్లు షైనీ విల్సన్‌ (1992 బార్సిలోనా), అంజూ జార్జి (2004 ఏథెన్స్‌)లకు ఈ గౌరవం దక్కింది.  

నా కెరీర్‌లో ఇదో గొప్ప ఘట్టం. ఆనందంలో నాకు మాటలు రావడంలేదు. మేరీకోమ్‌ లాంటి దిగ్గజ క్రీడాకారిణితో కలిసి ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో భారత్‌ బృందానికి పతాకధారిగా వ్యవహరించబోతున్నందుకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.     
–మన్‌ప్రీత్‌ సింగ్‌

భారత్‌ తరఫున ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో పతాకధారిగా వ్యవహరించనున్న ఆరో హాకీ ప్లేయర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌. గతంలో లాల్‌షా (1932–లాస్‌ ఏంజెలిస్‌), ధ్యాన్‌చంద్‌ (1936–బెర్లిన్‌), బల్బీర్‌సింగ్‌ సీనియర్‌ (1952 హెల్సింకి, 1956 మెల్‌బోర్న్‌), జఫర్‌ ఇక్బాల్‌ (1984–లాస్‌ ఏంజెలిస్‌), పర్గత్‌ సింగ్‌ (1996–అట్లాంటా)లకు ఈ గౌరవం లభించింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top