IPL 2022: Chennai Super Kings Celebrates Net Bowler Rocky's Birthday - Sakshi
Sakshi News home page

IPL 2022: నెట్‌ బౌలర్‌ జన్మదిన వేడుకలను దగ్గరుండి జరిపించిన ధోని

Mar 9 2022 5:11 PM | Updated on Mar 9 2022 7:31 PM

IPL 2022: Chennai Super Kings Celebrates Net Bowler Rockys Birthday - Sakshi

ఐపీఎల్‌ 2022 సన్నాహకాల్లో భాగంగా సూరత్‌లోని ప్రాక్టీస్‌ క్యాంప్‌లో బిజీబిజీగా గడుపుతున్న చెన్నై సూప‌ర్‌కింగ్స్‌ జట్టు.. ఇవాళ (బుధవారం) ఫ్రాంచైజీ నెట్‌ బౌలర్‌ రాకీ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌ను ఘ‌నంగా నిర్వహించింది. ఈ వేడుకలను జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని దగ్గరుండి జరిపించాడు. నెట్‌ బౌలరే కదా అని చిన్నచూపు చూడకుండా ధోని దగ్గరుండి రాకీతో కేక్‌ కట్‌ చేయించి, తినిపించి హడావుడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్‌కే ఫ్యాన్స్‌ ఆర్మీ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం వైరలవుతోంది. 


ఈ వీడియోలో ధోని కలుపుగోలుతనాన్ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇందుకే ధోని భాయ్‌ ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకుంటాడంటూ కామెంట్లు చేస్తున్నారు. సాధార‌ణ నెట్ బౌల‌ర్ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను ఇలా ఘ‌నంగా నిర్వ‌హించ‌డంపై సీఎస్‌కే యాజమాన్యంపై కూడా నెటిజన్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ వేడుక‌ల్లో సీఎస్‌కే సీనియర్‌ ఆటగాడు అంబ‌టి రాయుడు కూడా పాల్గొన్నాడు. 


ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2022 ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉండగానే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రంగంలోకి దిగింది. సూరత్‌లో ఏర్పాటు చేసిన క్యాంపులో ధోని సేన ప్రాక్టీస్ మొదలెట్టేసింది. సూరత్‌లో పరిస్థితులు ముంబైకి దగ్గరగా ఉంటాయనే కారణంగా ప్రాక్టీస్ సెషన్స్‌ను అక్కడ నిర్వహించాలని సీఎస్‌కే యాజమాన్యం నిర్ణయించింది. కెప్టెన్ ధోనితో పాటు అంబటి రాయుడు, కేఎం ఆసిఫ్, సి హరి నిషాంత్, తుషార్ దేశ్‌పాండే తదితరులు ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. 


కాగా, మార్చి 26న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. కరోనా కారణంగా ఈసారి లీగ్‌ మ్యాచ్‌లన్నీ ముంబై, పూణేల్లోని స్టేడియాల్లోనే జరుగుతాయని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.


చెన్నైసూప‌ర్ కింగ్స్ జట్టు: ఎంఎస్‌ ధోని (12 కోట్లు), రవీంద్ర జడేజా(16 కోట్లు), మొయిన్‌ అలీ (8 కోట్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌( 6 కోట్లు), దీపక్‌ చాహర్‌( 14 కోట్లు), అంబటి రాయుడు(6.75 కోట్లు), డ్వేన్ బ్రావో (4.4 కోట్లు), శివమ్ దూబే( 4 కోట్లు), క్రిస్‌ జోర్డాన్‌( 3.6 కోట్లు), రాబిన్ ఉతప్ప(2 కోట్లు), మిచెల్ సాంట్నర్ (1.9 కోట్లు), ఆడమ్ మిల్నే (1.9 కోట్లు), విక్రమ్‌ సోలంకి(1.2 కోట్లు), రాజ్‌వర్థన్‌(1.5 కోట్లు), డేవాన్‌ కాన్వే (రూ. కోటి), మహీష్ తీక్షణ (70 లక్షలు), ప్రిటోరియస్ ( 50 లక్షలు), కేఎమ్‌ అసిఫ్ (20 లక్షలు), తుషార్‌ దేశ్‌పాండే (20 లక్షలు), సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (20 లక్షలు), శుభ్రాన్ష్‌ సేనాపతి (20 లక్షలు), ముకేశ్‌ చౌధరి (20 లక్షలు), జగదీశన్‌ (20 లక్షలు), హరి నిషాంత్‌(20 లక్షలు)
చదవండి: IPL 2022: సీఎస్‌కే అభిమానులకు గుడ్‌న్యూస్‌.. అతడు వచ్చేస్తున్నాడు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement