ఆస్ట్రేలియాతో ఫైనల్‌ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? | India vs Australia: ICC U-19 World Cup Final | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాతో ఫైనల్‌ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా?

Feb 9 2024 8:52 AM | Updated on Feb 9 2024 9:25 AM

India vs Australia, ICC U-19 World Cup Final - Sakshi

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మరో కీలకపోరుకు రంగం సిద్దమైంది. అయితే ఈసారి పోరు సీనియర్ల మధ్య కాదు జూనియర్ల మధ్య. అండర్‌ 19 వరల్డ్‌కప్‌-2024 ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోన్నాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్‌పై ఒక్క వికెట్‌ తేడాతో విజయం సాధించిన ఆసీస్‌.. తమ ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.

 అంతకముందు తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన యువ భారత్‌.. 9వ సారి ఫైనల్లో అడుగుపెట్టింది. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి. ఫిబ్రవరి 11న సౌతాఫ్రికా బినోని స్టేడియం వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

జూనియర్లు ప్రతీకారం తీర్చుకుంటారా?
కాగా గత ఏడాదికాలంలో ఐసీసీ ఈవెంట్‌ ఫైనల్లో భారత్- ఆస్ట్రేలియా తలపడడం ఇది ముచ్చటగా మూడో సారి. గత రెండు ఈవెంట్​ (డబ్ల్యూటీసీ 2023, వన్డే వరల్డ్‌కప్‌ 2023)ల్లోనూ ఆసీస్ గెలుపొంది.. భారత అభిమానుల ఆశలపై నీళ్లు జల్లింది. ఈ క్రమంలో కనీసం యువ భారత జట్టు అయినా ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని 140 కోట్ల మంది అభిమానులు భావిస్తున్నారు. మరి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా మరోసారి దాసోహం అంటుందా అన్నది ఆదివారం వరకు వేచి చూడాలి.

కంగారులపై మనదే పై చేయి..
ఇక అండర్‌-19 వరల్డ్‌కప్‌లో మాత్రం కంగారులపై టీమిండియాదే పై చేయి. ఈ మెగా ఈవెంట్‌ ఫైనల్‌ పోరులో భారత్‌-ఆస్ట్రేలియా తలపడడం ఇది మూడో సారి. 2003 అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో తొలిసారిగా ఆసీస్‌- టీమిండియా తలపడ్డాయి. ఈ టోర్నీలో ఆసీస్‌ జట్టు కెప్టెన్‌గా రికీ పాంటింగ్‌ వ్యవహరించగా.. భారత జట్టును సౌరవ్‌ గంగూలీ ముందుకు నడిపించాడు.

అయితే ఫైనల్‌ మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో భారత్‌ను ఆసీస్‌ చిత్తు చేసింది. కానీ ఆ తర్వాత టోర్నీల్లో మాత్రం భారత్‌ జూలు విధిల్చింది. అనంతరం మళ్లీ 9 ఏళ్ల తర్వాత 2012 వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆసీస్‌- భారత్‌ అమీతుమీ తెల్చుకున్నాయి. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఉన్ముక్త్‌ చంద్‌ నేతృత్వంలోని భారత జట్టును ఆసీస్‌ను ఓడించి టైటిల్‌ను ముద్దాడింది. అదే విధంగా 2018 వరల్డ్‌కప్‌ తుదిపోరులోనూ యువ భారత్‌ మట్టికరిపించింది. ఈ సారి కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందని భారత అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

అద్భుత ఫామ్‌లో భారత్‌..
కాగా ప్రస్తుతం భారత జట్టు ఫామ్‌ను చూస్తుంటే ఆసీస్‌ను ఓడించి మరోసారి టైటిల్‌ను ఎగరేసుకోపోయేలా కన్పిస్తోంది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్​లో కూడా ఓడిపోకుండా ఫైనల్స్‌ చేరింది. భారత కెప్టెన్‌ ఉదయ్‌ సహారాన్‌, ముషీర్‌ ఖాన్‌, సచిన్‌ దాస్‌ వంటి యువ సంచలనాలు అద్భుత ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిశిచ్చే అంశం​.

మరోవైపు బౌలర్లలో రాజ్‌ లింబానీ మరోసారి చెలరేగితే ఆసీస్‌ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. అయితే ఆసీస్‌ను మాత్రం  తక్కువగా అంచనా వేయలేం. ఫైనల్‌ అంటే ఆసీస్‌కు పూనకాలే. పరిస్థితులు ఎలా ఉన్న ఆఖరి వరకు పోరాడడమే ఆసీస్‌ ప్రధాన అస్త్రం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement