రెండో ఇన్నింగ్స్‌లోనూ రెచ్చిపోయిన టీమిండియా బౌల‍ర్లు | India U19 Bowlers Collapsed Australia U19 For Just 116 Runs In 2nd Innings In 2nd Youth Test | Sakshi
Sakshi News home page

రెండో ఇన్నింగ్స్‌లోనూ రెచ్చిపోయిన టీమిండియా బౌల‍ర్లు

Oct 8 2025 10:27 AM | Updated on Oct 8 2025 10:51 AM

India U19 Bowlers Collapsed Australia U19 For Just 116 Runs In 2nd Innings In 2nd Youth Test

ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో భారత యువ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగిపోయారు. హెనిల్‌ పటేల్‌ (8-3-23-3), నమన్‌ పుష్పక్‌ (7-1-19-3), ఉధవ్‌ మోహన్‌ (8-4-17-2), దీపేశ్‌ దేవేంద్రన్‌ (6-2-15-1), ఖిలన్‌ పటేల్‌ (11.1-2-36-1) ధాటికి ఆసీస్‌ 116 పరుగులకు చాపచుట్టేసింది. తద్వారా భారత్‌ ముందు 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన అలెక్స్‌ లీ యంగ్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. మరో ముగ్గురు (కేసీ బార్టోన్‌ (19), జేడన్‌ డ్రేపర్‌ (15), అలెక్స్‌ టర్నర్‌ (10)) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. సైమన్‌ బడ్జ్‌, జెడ్‌ హోల్లిక్‌ డకౌట్లు కాగా.. కెప్టెన్‌ విల్‌ మలాజ్‌చుక్‌, యశ్‌ దేశ్‌ముఖ్‌ తలో 5, ఛార్లెస్‌ లచ్‌మండ్‌ 9, విల్‌ బైరోమ్‌ 8 పరుగులు చేశారు.

అంతకుముందు ఆసీస్‌ బౌలర్లు భారత్‌ను 171 పరుగులకే ఆలౌట్‌ చేశారు. భారత ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును చేరలేదు. 28 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్‌ ఆటగాడు దీపేశ్‌ దీపేంద్రన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. ఖిలన్‌ పటేల్‌, వేదాంత్‌ త్రివేది, హెనిల్‌ పటేల్‌, వైభవ్‌ సూర్యవంశీ, విహాన్‌ మల్హోత్రా వరుసగా 26, 25, 22, 20, 11 పరుగులు స్కోర్‌ చేశారు.  

కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 4 పరుగులకే ఔట్‌ కాగా.. రాహుల్‌ కుమార్‌ 9, హర్వంశ్‌ పంగాలియా 1, నమన్‌ పుష్పక్‌ డకౌటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బౌలర్లు సైతం మూకుమ్మడిగా సత్తా చాటారు. 

కేసీ బార్టన్‌ 4, ఛార్లెస్‌ లిచ్‌మండ్‌, విల్‌ బైరోమ్‌, జూలియన్‌ ఓస్బర్న్‌ తలో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 171 పరుగులకే ఆలౌటైనా 36 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. హెనిల్‌ పటేల్‌ (9-3-21-3), ఖిలన్‌ పటేల్‌ (12-5-23-3), ఉధవ్‌ మోహన్‌ (6-0-23-2), దీపేశ్‌ దేవేంద్రన్‌ (7.3-2-22-1) ధాటికి 135 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌ కీపర్‌ లీ యంగ్‌ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.

కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ల కోసం భారత అండర్‌ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన భారత్‌.. టెస్ట్‌ సిరీస్‌లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌ను కూడా గెలిస్తే భారత్‌ ఆసీస్‌ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్‌ స్వీప్‌ చేసినట్లవుతుంది.

చదవండి: ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్‌.. మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌..?



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement