IND VS SL 1st ODI: రోహిత్‌.. లంకపై చేసిన హాఫ్‌ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా..?

IND VS SL 1st ODI: Rohit Sharma Dedicates His Half Century To His Deceased Pet Dog - Sakshi

గౌహతి వేదికగా శ్రీలం‍కతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మెరుపు హాఫ్‌ సెంచరీతో విరుచుకుపడిన విషయం తెలిసిం‍దే. చాలాకాలం తర్వాత మునపటి టచ్‌లో కనబడిన హిట్‌ మ్యాన్‌.. 41 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా  67 బంతులు ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్‌.. 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రోహిత్‌ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మధుశంక బౌలింగ్‌లో బంతి ఇన్‌ సైడ్‌ ఎడ్జ్‌ తీసుకోవడంతో రోహిత్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే.. నిన్న (జనవరి 9) రోహిత్‌ అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మ్యాజిక్‌ చనిపోయింది. ఈ విషయాన్ని రోహిత్‌ భార్య రితిక తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. మ్యాజిక్‌ లేదన్న బాధలోనే ఈ మ్యాచ్‌ బరిలోకి దిగిన రోహిత్‌.. ఫిఫ్టి పూర్తి కాగానే ఆకాశం వైపు చూస్తూ మ్యాజిక్‌ పేరును స్మరిస్తూ, చాలాకాలం తర్వాత చేసిన కీలక హాఫ్‌ సెంచరీని మ్యాజిక్‌కు అంకితమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌ (70)లు హాఫ్‌ సెంచరీలతో రాణించగా, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్‌) శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. లంక బౌలర్లలో కసున్‌ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్‌ దక్కించుకున్నారు.  

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top