ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయాన్ని అందుకుంది. 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఊదిపడేసింది.
ఈ విజయంలో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(83), రోహిత్ శర్మ(84) కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్ధిక్ పాండ్యా బదులుగా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించాడు. హార్దిక్ వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నట్లు టాస్ సందర్భంగా సూర్యకుమార్ తెలిపాడు.
అయితే ఈ ఏడాది సీజన్లో మిగిలిన మ్యాచ్ల్లో పాండ్యా ఆడే సూచనలు కన్పించడం లేదు. లక్నోతో మ్యాచ్ అనంతరం హార్దిక్ గాయంపై ముంబై వికెట్ కీపర్ బ్యాటర్ రికెల్టన్ అప్డేట్ ఇచ్చాడు. హార్దిక్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడని, అతడు ప్రస్తుతం జట్టుతో లేడని రికెల్టన్ చెప్పుకొచ్చాడు.
"హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్నాని ఈ రోజే నాకు తెలిసింది. అయితే ఆ గాయం తీవ్రత ఎలా ఉందన్న విషయం నాకు తెలియదు. మా తదుపరి మ్యాచ్కు దాదాపు ఆరు రోజుల విశ్రాంతి లభించింది. ఈ సమయంలో హార్దిక్ కోలుకుని, తిరిగి రాయ్పూర్లో జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నా" అని రికెల్టన్ పేర్కొన్నాడు.
కాగా ఈ ఏడాది సీజన్లో కూడా పాండ్యా కెప్టెన్గా తన మార్క్ చూపించలేకపోయాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా ఈ బరోడా క్రికెటర్ విఫలమయ్యాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. వెంటనే కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పాండ్యా గాయం కారణంగా తనంతట తానే ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలిగే పరిస్థితి ఏర్పడింది.
చదవండి: అర్జున్ టెండుల్కర్ను ఎందుకు ఆడించట్లేదు?


