RCB Vs PBKS: 'డీకే' ది ఫినిషర్‌.. కేవలం 10 బంతుల్లోనే విధ్వంసం! వీడియో వైర‌ల్‌ | IPL 2024 RCB Vs PBKS: Dinesh Karthik Guiding RCB To Thrilling Win Against Punjab Kings, Video Goes Viral - Sakshi
Sakshi News home page

#Dinesh Karthik: 'డీకే' ది ఫినిషర్‌.. కేవలం 10 బంతుల్లోనే విధ్వంసం! వీడియో వైర‌ల్‌

Published Tue, Mar 26 2024 6:10 AM

Dinesh Karthik guiding RCB to thrilling win against Punjab Kings - Sakshi

ఐపీఎల్‌-2024లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తొలి విజ‌యం న‌మోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఫినిషర్ అవతారమెత్తాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని ఈ వెట‌ర‌న్ అందించాడు. 

177 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే బిగ్ షాక్ త‌గిలింది. కెప్టెన్ డుప్లెసిస్ కేవ‌లం 3 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన గ్రీన్ సైతం   నిరాశ‌ప‌రిచాడు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికీ మ‌రో  ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లి మాత్రం ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు.

బౌండ‌రీలు వ‌ర్షం కురిపిస్తూ బౌల‌ర్ల‌ను ఒత్త‌డిలోకి నెట్టే ప్ర‌య‌త్నించాడు. పాటిదార్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే పాటిదార్ ఎక్కువ స‌మయం పాటు కోహ్లికి స‌పోర్ట్‌గా నిల‌వ‌క‌పోయాడు. హ‌ర్‌ప్రీత్ బ‌రార్ బౌలింగ్‌లో పాటిదార్ ఔట‌య్యాడు. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన మాక్స్‌వెల్ సైతం హ‌ర్‌ప్రీత్‌కే చిక్కాడు.

మాక్స్‌వెల్ ఔటయ్యే స‌మ‌యానికి ఆర్సీబీ స్కోర్ 12.1 ఓవ‌ర్ల‌లో 103/3. అంటే ఆర్సీబీ విజ‌యానికి 7.5 ఓవ‌ర్ల‌లో 74 ప‌రుగులు కావాలి. కొంచెం క‌ష్ట‌మైన టాస్క్ అయిన‌ప్ప‌టికి కోహ్లి క్రీజులో ఉండ‌డంతో అభిమాన‌లు థీమాగా ఉన్నారు. కోహ్లికి తోడుగా రావ‌త్ క్రీజులోకి వ‌చ్చాడు. రావ‌త్ సింగిల్స్ తీసుకుంటూ కోహ్లికి స్ట్రైక్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

కోహ్లి వీలుచిక్కిన‌ప్పుడుల్లా బౌండ‌రీలు బాదుతూ ల‌క్ష్యాన్ని కాస్త త‌గ్గించాడు. అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్ 16 ఓవ‌ర్ వేసిన హ‌ర్ష‌ల్ ప‌టేల్ బౌలింగ్‌లో వ‌రుస బౌండ‌రీలు బాదిన విరాట్ కోహ్లి.. ఆఖ‌రి బంతికి ఔట‌య్యాడు. దీంతో గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. 77 ప‌రుగులు చేసిన విరాట్ నిరాశ‌తో మైదానాన్ని వీడాడు. క్రీజులోకి ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా మ‌హిపాల్ లామ్రోర్ వ‌చ్చాడు. ఆ త‌ర్వాతి ఓవ‌ర్‌లో రావ‌త్ సైతం పెవిలియ‌న్‌కు చేరాడు.

ఈ క్ర‌మంలో  దినేష్ కార్తీక్ వ‌చ్చాడు. కార్తీక్‌ క్రీజులోకి వచ్చిన వెంటనే తన బ్యాట్‌కు పనిచెప్పాడు. సామ్‌ కుర్రాన్‌ వేసిన 17 ఓవర్‌ను ఫోర్‌ బాది కార్తీక్‌ ముగించాడు. ఆ తర్వాత 18 ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ ఓవర్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన మహిపాల్‌ సిక్స్‌, ఫోరు బాది మ్యాచ్‌ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు. ఆ తర్వాత మ్యాచ్‌ను ఫినిష్‌ చేసే బాధ్యతను కార్తీక్‌ తీసుకున్నాడు.

ఈ క్రమంలో ఆఖరి రెండు ఓవర్లలో ఆర్సీబీ విజయానికి 23 పరుగులు అవసరమవ్వగా కార్తీక్‌ చెలరేగిపోయాడు. 19 ఓవర్ వేసిన హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో వరుసగా ఫోరు, సిక్స్‌ బాదిన డికే.. 20 ఓవర్లలో తొలి రెండు బంతులను బౌండరీలగా మలిచి మ్యాచ్‌ను ముగించాడు.  కేవలం 10 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఫలితంగా 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఈ క్రమంలో కార్తీక్‌పై ఆర్సీబీ అభిమానులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

Advertisement
Advertisement